ఏపి ఎన్నికల్లోనూ టిడిపి కుట్రలు: వైవి సుబ్బారెడ్డి, విఫలమేనన్న అనంత
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ కుట్రలకు పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. సోమవారం మాట్లాడుతూ.. మెజార్టీ లేకపోయినా టిడిపి అభ్యర్థిని పోటీకి నిలబెడుతోందని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అట్టా చికవెంకటరెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వక్య్తం చేశారు.
ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ సభ్యులు నిజాయితీతో ఉన్నారన్నారు. కాగా, ప్రకాశం జిల్లాలో టిడిపి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ చేస్తున్నారు.
చంద్రబాబు విఫలం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు రుణాలు మాఫీ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా విఫలమయ్యారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, వై. విశ్వేశ్వర్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డిలు ఆరోపించారు. రాష్ట్ర ప్రజల పట్ల ఏపీ సర్కారు అవలంభిస్తున్న తీరును వారు తప్పుబట్టారు.
రుణాలను మాఫీ చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. కొత్త రుణాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నాపట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తూ.. తాగునీటి ప్రాజెక్టుగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.
రైతులకు రుణాలు మాఫీ చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం రాయలసీమ ప్రజల పట్ల శాపంగా మారిందని ధ్వజమెత్తారు.
వేరు శనగ విత్తనాల పంపిణీలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. టిడిపి నేతలు అక్రమంగా విత్తనాలను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.