జగన్కు బంధువుల షాక్: బాలినేని ఎఫెక్ట్, వైవీ సుబ్బారెడ్డి దూరం!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరి సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి.
ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరి సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయన బావ, ఒంగోలు లోకసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి మధ్య సఖ్యత లేదని తేలిందంటున్నారు.
చదవండి: కేసీఆర్కు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆహ్వానం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయా జిల్లాల్లో ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఒంగోలులో జరిగిన ప్లీనరీలకు వైవీ సుబ్బారెడ్డి గైర్హాజరయ్యారు. అంతేకాదు, శనివారం ఒంగోలులో జరిగిన నియోజకవర్గ ప్లీనరీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో లేదు.
కనిపించని వైవి సుబ్బారెడ్డి ఫోటో
ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వైవీ సుబ్బారెడ్డి ఫోటో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో గురువారం నుంచి నియోజకవర్గాల వారీ వైసిపి ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
తొలి రోజు ఒంగోలు లోకసభ సెగ్మెంట్ పరిధిలోని మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్లీనరీలు విజయవంతమయ్యాయి. ఈ సమావేశాల్లో బాలినేనికి కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ రెండు సమావేశాలకు లోకసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి హాజరు కాలేదు.
అందుకే రాలేదని...
ఆయన అందుబాటులో లేకపోవడం వల్లనే హాజరు కాలేదని వైసిపి నాయకులు చెబుతున్నారు. కానీ విభేదాల వల్లే ఇది చోటు చేసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే నెల 8న రాష్ట్ర ప్లీనరీ విజయవాడలో జరగనుంది.
ఆ అవకాశమున్నా..
ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి ప్లీనరీలు ఈ నెల 19, 21 మధ్య నిర్వహించాలని రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. ఈ లోపు ఒంగోలు లోకసభయేతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్లీనరీలను నిర్వహించుకొని ఎంపీ అందుబాటులో ఉన్న సమయంలో ఒంగోలు లోకసభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ప్లీనరీలు నిర్వహించుకునే అవకాశమున్నప్పటికీ అలా చేయలేదంటున్నారు.
వారు ఫోటోలు ఉన్నప్పటికీ..
అందుకు పార్టీ ముఖ్య నాయకుల మధ్య సఖ్యత లేకపోవడమే కారణమా అనే చర్చ సాగుతోంది. శనివారం ఒంగోలు ప్లీనరీ సందర్భంగా నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా ఎంపీ సుబ్బారెడ్డి ఫొటో కన్పించలేదు. తాత్కాలిక పరిశీలకుడిగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఫొటో ఫ్లెక్సీల్లో ప్రముఖంగా ఉన్నప్పటికీ ఎంపీకి మాత్రం చోటు దక్కలేదు.
విభేదాలే కారణమా?
సమావేశం హాలు లోపల వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వైవి సుబ్బారెడ్డి ఫొటో కనిపించలేదు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఫెక్సీల్లో ఎక్కడా ఆయన ఫొటో లేదు. ఇది బాలినేని, వైవీల మధ్య ఉన్న విభేదాలను మరోసారి తేటతెల్లం చేసిందని అంటున్నారు.