‘బుట్టా రేణుక పార్టీ మారినా.. మోసం చేశారంటూ హెచ్చరిక’
పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అలాగే పోలవరం కాంట్రాక్టర్ను కాపాడేందుకే చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని, అంచనావ్యయం పెంచుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. పోలవరం అవినీతిపై కేంద్రం దర్యాప్తు చేయాలని ప్రధాని, కేంద్రమంత్రులను కోరతామని ఆయన అన్నారు.
రేణుక పార్టీ మారినా..
బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పార్టీ మారుతుండటంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. బుట్టా రేణుక పార్టీ మారిన ప్రభావం జగన్ పాదయాత్రపై ఉండదని స్పష్టం చేశారు. సీఎం చేసిన అభివృద్ధి చూశానంటున్న రేణుకకు వైవీ గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం చంద్రబాబునాయుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేయడం చాలా అభివృద్ధి సాధించారని ఎద్దేవా చేశారు.
జగన్ అలా.. బాబు ఇలా..: బుట్టా రేణుకపై రోజా పవర్ పంచ్లు
ఏ అభివృద్ధి చూశారు?
కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కూడా బుట్టా రేణుకపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచి, ఇప్పుడు అభివృద్ధి పేరు చెబుతూ టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక ఏ అభివృద్ధి చూశారో చెప్పాలని ప్రశ్నించారు.
మోసం చేశారంటూ హెచ్చరిక
ఓట్లు వేసిన ప్రజలు, నమ్మిన పార్టీని మోసం చేసిన రేణుకకు వచ్చే ఎన్నికల్లో ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని వెంకటరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు మాయలో పడి విడ్డూరంగా మాట్లాడుతున్నారని అన్నారు.
బుట్ట పోతే వందిమంది వస్తారు..
గత మూడన్నరేళ్లుగా జరగని అభివృద్ధి ఏడాదిన్నరలో ఎలా జరుగుతుందో చెప్పాలని గౌరు ప్రశ్నించారు. బుట్టా రేణుక వంటి ఒక నేత పార్టీని వీడితే.. అటువంటి నేతలు వందమంది తమ పార్టీలోకి వస్తారని వెంకటరెడ్డి చెప్పారు.
పోలవరం పేరుతో దోపిడీ
వైయస్ హయాంలో రూ.16వేల కోట్లు మాత్రమే ఉన్న అంచనా వ్యయాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెట్టింపు చేశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ ఎంపీనే కాంట్రాక్టర్ అని ఆయన చెప్పారు. పోలవరాన్ని అవినీతి రహిత ప్రాజెక్టుకుగా నిర్మించాలని డిమాండ్ చేశారు. అవినీతి రహితంగా ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రమంత్రి గడ్కరీనే అన్నారని, హడావుడిగా చంద్రబాబు ఎందుకు నాగ్పూర్ వెళ్లారని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టుపై కొత్త ప్రతిపాదనలు చెప్పేందుకే చంద్రబాబు వెళ్లారని, కాంట్రాక్టర్తో కాకుండా చంద్రబాబే పనులు చేస్తున్నారని, కాంట్రాక్టర్లను అడ్డం పెట్టుకొని దోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అసలు పనులను మెయిన్ కాంట్రాక్టర్ చేస్తున్నారా.. సబ్ కాంట్రాక్టర్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ పనితీరు నచ్చకపోతే మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని, పోలవరం ప్రాజెక్టుపై ఎంత ఖర్చు అవుతుందో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు భూ నిర్వాసితుల సమస్యలే పరిష్కారం కాలేదని విమర్శించారు. పోలవరం నిర్మాణంలో జరగుతున్న అవినీతిపై ఎంపీలతో కలిసి కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు.