భారతిపై కేసులు ఉండేవా, మావి సరే, మీ ఎన్నికల మాటేమిటి: వైవీ, వంగవీటి రాధా ఇష్యూపై..
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధా అసంతృప్తిపై ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి గురువారం స్పందించారు. కొన్నిచోట్ల బలాన్ని బట్టి, గెలుపోటములను బేరీజు వేసుకొని మార్పులు తప్పవని చెప్పారు. ఓ నియోజకవర్గంలో నాలుగేళ్లు కాదు, ఎనిమిది ఏళ్ల నుంచి ఉన్న వారిని కూడా మార్చక తప్పదని చెప్పారు.
ప్రత్యర్థులను బట్టి అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. వంగవీటి రాధా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు. ఆయన పార్టీని వీడరని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తాము అభ్యర్థులను ఖరారు చేస్తామని అభిప్రాయపడ్డారు.
హోదా విషయంలో టీడీపీకి నైతిక హక్కు లేదు
ప్రత్యేక హోదా సాధన విషయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. హోదా కోసం తనతో సహా తన పార్టీ నేతలం ఎంపీ పదవులకు రాజీనామా చేశామని చెప్పారు. హోదాకోసం రాజీనామా చేసిన తనపై మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని మండిపడ్డారు.
భారతిపై కేసులు ఎందుకు పెడతారు
హోదా కోసం తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు చిత్తశుద్ధితో పోరాటం చేశారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన తర్వాత చర్చ పెట్టలేదని, కానీ టీడీపీ ఇస్తే మాత్రం కేంద్రం చర్చకు పెట్టిందని గుర్తు చేశారు. తాము బీజేపీతో కలిసి ఉంటే తమపై, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై కేసులు ఎందుకు పెడతారని నిలదీశారు.
మా ఉప ఎన్నికలు సరే, మీ మాటేమిటి?
బీజేపీ, తెలుగుదేశం పార్టీ మధ్య కుమ్మక్కు రాజకీయాలకు అవిశ్వాస తీర్మానం సమయం, నోటీసులపై చర్చనే సాక్ష్యమని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 2014లో తమ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, వారిపై ఏపీ స్పీకర్ చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు వచ్చేవి కదా, దాని గురించి ఏం మాట్లాడుతారని టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.
రాజ్నాథ్ చెప్పారు
లోకసభ ఎంపీ బుట్టా రేణుకపై చర్యలు తీసుకోవాలని తాము ఫిర్యాదు చేశామని, ఆమెపై చర్య తీసుకున్నా ఎన్నికలు వచ్చేవి కదా అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ తమకు మిత్రుడేనని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగే స్వయంగా లోకసభలో చెప్పారన్నారు. హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే తమను అరెస్ట్ చేయించారని, ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ముందే రాజీనామా చేశామన్నారు.
దీక్ష చేస్తే భగ్నం
2018 ఏప్రిల్ 6వ తేదీన తాము రాజీనామా చేశామని చెప్పారు. టీడీపీ, బీజేపీ భాగస్వాములుగా ఉండి, ఈ నాలుగేళ్లు ఏపీకి మోసం చేశాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకే తాము పదవులు వదులకున్నామని అన్నారు. గుంటూరులో హోదా కోసం జగన్ ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే భగ్నం చేయించింది చంద్రబాబే అన్నారు. తాము కూడా రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేశామని, వీటిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.