జగన్ సీఎం ఐతే బాబుకు చుక్కలు!: వైవీ, 'అప్పుల కోసం బ్రోకరేజ్ సంస్థకు కమిషన్'
అమరావతి: వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమామహేశ్వర రావులు జైలు యాత్ర చేయాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
నిరూపిస్తే రాజీనామా
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. టీడీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పట్టించుకోవడం లేదన వాపోయారు. వచ్చే ఎన్నికల్నిదృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు.
అప్పుడు జైలు యాత్ర చేస్తారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమల అవినీతిపై విచారణ చేపడతామన్నారు. వీళ్లంతా అప్పుడు జైలు యాత్ర చేయాల్సిందే అన్నారు. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లానే అని, జిల్లాలో ఎప్పుడూ కరువు విలయతాండవం చేస్తోందన్నారు.
58 ఏళ్లలో లక్ష కోట్లు, నాలుగేళ్లలో లక్షన్నర కోట్లు
చంద్రబాబు పాలనలో నవ్యాంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ నేత తులసి రెడ్డి మండిపడ్డారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి అమరావతి నగరాన్ని నిర్మించడం సిగ్గుచేటు అన్నారు. 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు అప్పు కాగా, చంద్రబాబు నాలుగేళ్ళ పాలనలోనే రూ.1,49,435 కోట్ల మేర అప్పులు చేశారని తీవ్రంగా మండిపడ్డారు.
అప్పు చేసేందుకు సాయపడిన బ్రోకరేజ్ సంస్థకు కమిషన్
చట్ట ప్రకారం రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వం సాయంతో చేయాలని తులసి రెడ్డి అన్నారు. వారితో పోరాడకుండా అప్పులు తీసుకురావడం సరికాదన్నారు. అప్పు చేసేందుకు సహాయపడిన బ్రోకరేజ్ సంస్థకు కమిషన్ కింద 0.85 శాతం ఇవ్వడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేంద్రం గ్రాంటుతోనే సర్వాంగసుందర రాజధానిని నిర్మించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామన్నారు.