ప్రత్యేక హోదాపై జగన్ బాబాయి: ప్రాజెక్ట్కు గండి, దేవినేనికి చిక్కులు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పార్టీ పోరాడుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సోమవారం నాడు అన్నారు. ప్రత్యేక హోదా వేరు, ప్రత్యేక ప్యాకేజీ వేరు అని చెప్పారు.
అధికార పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్నారు. జివిఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపిదే గెలుపు అన్నారు.
కోటి సంతకాల సేకరణ
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 23వ తేదీన ఏయూలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణను ప్రారంభిస్తున్నట్లు విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ నేత భాస్కర రావు చెప్పారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అనంతపురంలో ముగుస్తుందన్నారు.
పోలవరంకు గండిపై కొత్తపల్లి
పోలవరం కుడి కాల్వకు గండిపడిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఒక్క పంపుతోనే గండిపడితే ఇక 12 పంపులు పూర్తిగా నిర్మించాక పరిస్థితి ఏమిటని కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరిగిందని చెప్పేందుకు ఈ ఘటననే నిదర్శనం అని ఆయన చెప్పారు.
పట్టిసీమ పనుల్లో ఏర్పడిన సమస్య ఎందుకు జరిగింది, ఎవరితో జరిగిందనే విషయమై నిపుణులతో కమిటీ వేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి దేవినేని చెప్పారు. ఆదివారం అక్విడెక్ట్కు గండిపడిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.