కారం తిన్నాం కాబట్టే పోరాడుతున్నాం.. : పవన్ కు వైసీపీ ఎంపీ కౌంటర్
ఒంగోలు : ప్రతిపక్షం వైసీపీ నేడు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. బంద్ లో పాల్గొనడం కోసం ఇంటినుంచి బయలుదేరిన ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డిని ఆయన ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు పోలీసులు. దీంతో ఇంట్లోనే బైఠాయించిన సుబ్బారెడ్డి, అక్కడే ఆందోళన చేపట్టారు. భారీగా మోహరించిన పోలీసులు ఎంపీ ఇంటి చుట్టూ పహారా కాస్తుండడంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
కాగా, నిర్బంధంపై స్పందించిన ఎంపీ సుబ్బారెడ్డి.. ఏపీలో చంద్రబాబు నాయుడు రాక్షస పాలన కొనసాగుతోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా సాగుతున్న బంద్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని చూస్తోందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాగ్రహాన్ని అణిచేయలేరని తేల్చి చెప్పారు.
కారం తిన్నాం కాబట్టే.. పోరాటం..
ఇక నిన్నటి కాకినాడ సభలో ఎంపీలంతా కాస్త ఒంటికి కారం పూసుకోవాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ సుబ్బారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కారం తిన్నాం కాబట్టే పోరాటం చేస్తున్నామన్న సంగతి తెలుసుకోవాలని పవన్ కు సూచించారు. 'మీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వైసీపీ ఎంపీలు గెలవలేదని' పవన్ ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు.