బిజెపిపై టిడిపి గుర్రు: జలీల్ తీవ్ర వ్యాఖ్య, వైసిపి లేకుంటే విభజన జరిగేది కాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై తెలుగుదేశం పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ పైన భగ్గుమంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చిన చెప్పడంతో కేంద్రంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు నుంచి ఇటీవల టిడిపిలో చేరిన జలీల్ ఖాన్లు నిప్పులు చెరిగారు.
జలీల్ ఖాన్ మాట్లాడుతూ... తలకిందులైనా ఏపీలో బిజెపి అధికారంలోకి రాదన్నారు. మతతత్వ పార్టీని ఏపీ ప్రజలు సమర్థించరన్నారు. నిరుద్యోగ నేతలే చంద్రబాబును విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. హోదా ఇవ్వని కేంద్రంపై పోరాడాలన్నారు.
చెట్టు కాయలు ఎందుకు రాలుతున్నాయో జగన్ గుర్తించాలన్నారు. వైసిపి లేకపోతే రాష్ట్ర విభజన జరిగేది కాదని కొత్త వ్యాఖ్య చేశారు.
ఎంపీ తోట నర్సింహం మాట్లాడుతూ.. హోదాపై మరోసారి ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలుస్తామని చెప్పారు. విభజన నాటి నుంచి ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలను సభలో వెల్లడించిన జైట్లీ.. హోదా గురించి ప్రస్తావించకపోవడం అసంతృప్తి కలిగించిందన్నారు.
విభజన సమస్యలు ఎప్పుడూ వెంటాడుతున్నాయని, కేంద్రం నుంచి తగిన సహకారం లేదని ఏపీ సీఎం చంద్రబాబు వేరుగా అన్నారు. కేంద్రం నుంచి సహకారం లేనప్పటికీ తాను రుణాలు మాఫీ చేస్తున్నానని చెప్పారు.
విభజన సమస్యలు ఇప్పటికీ వెంటాడుతున్నాయన్నారు. లోటు బడ్జెట్లోను ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏపీలో లోటు బడ్జెట్ ఉందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు కేంద్రం సహకారం కావాలన్నారు.