జీరో వడ్డీ పథకం ప్రారంభించి మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుపేదలకు మరో వరం ఇవ్వనున్నట్టు ప్రకటించారు . నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జీరో వడ్డీ పథకాన్ని ప్రారంభించిన జగన్ జులై 8 వైఎస్సార్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు . అంతే కాదు ఉచితంగా ఇల్లు కూడా కట్టించి ఇస్తామని పేర్కొన్నారు .ఇక నేడు వైఎస్సార్ జీరో వడ్డీ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు . ఈ సందర్భంగా మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీఎం మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం ఏం చేస్తుందో వారికి వివరించారు .
ఇక ఇదే సమయంలో నామినేటెడ్ పనులు, పదవుల్లో 50% మహిళలకు ఇవ్వాలని గొప్ప చట్టం తెచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు . మహిళల రక్షణ కోసం కఠినంగా శిక్ష పడేలా దిశ చట్టాన్ని తీసుకొచ్చామని పేర్కొన్న సీఎం జగన్ 13 దిశ పోలీస్స్టేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశామని చెప్పారు .వసతి దీవెన కింద 12 లక్షల మందికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామనిఏర్కొన్న ఆయన విద్యార్థుల చదువుల కోసం గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇచ్చామని చెప్పారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ను నేరుగా తల్లుల అకౌంట్ల్లో జమ చేస్తామని పేర్కొన్నారు .
ఇప్పటివరకు తమ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరించిన సీఎం అమ్మ ఒడి పథకం గురించి ప్రస్తావించారు. 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సంక్షేమ పథకాలను అందించి ఏపీ ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. ఇక జులై 8 న ఇళ్ళపట్టాలు ఇవ్వటానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు . నిరుపేదలైన వారికి ఇళ్ళ పట్టాలతో పాటు ఇల్లు కూడా కట్టి ఇస్తామని దీని ద్వారా 27 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది అని పేర్కొన్నారు . ఇక నేడు ప్రారంభించిన సున్నా వడ్డీ స్కీం ద్వారా గ్రూపునకు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు మేలు జరుగుతుందన్నారు.