ఏప్రిల్ 6న స్థానిక ఎన్నిక, గత ప్రభుత్వంవల్లే: రమాకాంత్
హైదరాబాద్: ఏప్రిల్ 6న జెడ్పీటిసి, ఎంపీటిసి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి సోమవారం చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్థానిక సంస్థల పైన తమ సూచనను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే ఈ గందరగోళం ఏర్పడిందని చెప్పారు.
సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించినట్లయితే ఈ గందరగోళ పరిస్థితి తలెత్తక పోయి ఉండేదన్నారు. ప్రస్తుత గందరగోళ పరిస్థితికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రస్తుతం లోకసభ, అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం వల్ల యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి పడుతుందన్నరు.
సుప్రీం ఆదేశాలతో తాము ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటికప్పుడు చెప్పినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికల నిర్వహణపై కొందరు కోర్టులకు వెళ్లినట్లుగా తెలుస్తోందని కానీ, ఎన్నికలు ఆపివేయాలని లేదా ఫలితాలు ప్రకటించకూడదని కేంద్రం లేదా ఈసి తమను ఆదేశించలేదన్నారు. ఒకవేళ ఆదేశించినా తాము దానిని పక్కన పెట్టగలమని, తమకు రాజ్యంగం ఆ హక్కు కల్పించిందన్నారు.
6న ఎన్నికలు
ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు ఎన్నికలు ఉంటాయన్నారు. పార్టీ ప్రాతిపదికన పార్టీల గుర్తుపై ఎన్నికలు ఉంటాయన్నారు. 7న అవసరాన్ని బట్టి రీపోలింగ్, 8న ఫలితాలు ఉంటాయన్నారు. ఎన్నికల రిజర్వేషన్కు సంబంధించి ప్రభుత్వం వివరాలు పంపించినందున తాము నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోసం అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు లేవు కాబట్టి తాము బ్యాలెట్ బాక్సులు వాడుతామన్నారు.
22 జిల్లాలకు పరోక్ష జిల్లా పరిషత్ ఎన్నికలు, 1096 మండల పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మార్చి 17 నుండి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 21న పరిశీలిస్తామని చెప్పారు. 24న ఉపసంహరణ ఉంటుందన్నారు. 22 జిల్లా పరిషత్లకు అధికారులను నియమించినట్లు చెప్పారు.