సిడ్నీలో కోహ్లీసేనకు తప్పిన పెనుముప్పు: బస చేసిన హోటల్ సమీపంలో కుప్పకూలిన ఛార్టెడ్ ప్లైట్
సిడ్నీ: భారత క్రికెట్ జట్టుకు పెను ముప్పు తప్పింది. ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన టీమిండియా బస చేసిన హోటల్ సమీపంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన కోహ్లీసేనను ఉలిక్కిపడేలా చేసింది. భయాందోళనలకు గురి చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విషయం తెలిసిన వెంటనే క్రికెట్ ప్రేమికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరిగిందోనంటూ ఆరా తీస్తున్నారు. భారత క్రికెటర్లకు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
సిడ్నీ ఒలింపిక్ పార్క్..
విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్ కోసం బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. క్రికెటర్లు, హెడ్ కోచ్ రవిశాస్త్రి, సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం ప్రస్తుతం సిడ్నీలో ఉంటోంది. సిడ్నీ ఒలింపిక్ పార్క్ హోటల్లో బస చేసింది. బయో సెక్యూర్ బబుల్లో భాగంగా టీమిండియా అక్కడే క్వారంటైన్ కాలాన్ని గడుపుతోంది. సిడ్నీలోని క్రోమర్ పార్క్ స్టేడియం సమీపంలో ఓ ఛార్టెడ్ ఫ్లైట్ కుప్పకూలింది. ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశం.. సిడ్నీ ఒలింపిక్ పార్క్ హోటల్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇంజిన్ స్తంభించిపోవడంతో..
ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మిడ్ ఎయిర్లో ఈ తేలికపాటి విమానం ఇంజిన్ ఒక్కసారిగా స్తంభించిపోవడంతో ప్రమాదానికి కారణమైంది. ఇంజిన్ నిలిచిపోవడంతో ఈ విమానం కుప్పకూలింది. క్రోమర్ పార్క్ స్టేడియానికి అతి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో స్టేడియంలో స్థానిక క్రికెటర్లు, ఫుట్బాల్ ప్లేయర్లు మ్యాచ్లను ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
క్రోమర్ క్రికెట్ క్లబ్ స్టేట్మెంట్ ఇదీ..
పెద్ద శబ్దం చేస్తూ విమానం కుప్పకూలిపోవడంతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. సురక్షిత ప్రదేశాలకు పారిపోయారు. వారంతా సురక్షితంగా ఉన్నారని క్రోమర్ క్రికెట్ క్లబ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ రోల్లిన్స్ తెలిపారు. విమానం కూలిన ప్రదేశంలో ప్రజలు ఎవ్వరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంకొన్ని నిమిషాల పాటు విమానం ఇంజిన్ ఆలస్యంగా స్తంభించిపోయి ఉంటే.. సిడ్నీ ఒలింపిక్ పార్క్ హోటల్ దగ్గర కుప్పకూలి ఉండేదని గ్రెగ్ అభిప్రాయపడ్డారు.
సుదీర్ఘ టూర్..
ఐపీఎల్-2020 సీజన్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లింది. మూడు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టీ20లు, నాలుగు టెస్ట్మ్యాచ్లను ఆడబోతోంది కోహ్లీ అండ్ టీమ్. వన్డే మ్యాచ్లతో సిరీస్ ఆరంభం కానుంది. ఈ నెల 27, 29 తేదీల్లో తొలి రెండు వన్డేలను నిర్వహించేలా క్రికెట్ ఆస్ట్రేలియా షెడ్యూల్ చేసింది. ఈ రెండు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తారు. మూడో వన్డే, తొలి టీ20 మ్యాచ్లు క్యాన్బెర్రాలోని ఓవల్లో జరుగుతాయి. చివరి రెండు టీ20ల కోసం మళ్లీ ఆ రెండు జట్లూ సిడ్నీకే వస్తాయి.
ఇదీ షెడ్యూల్..
తొలి వన్డే: నవంబర్ 27 (సిడ్నీ), రెండో వన్డే: నవంబర్ 29 (సిడ్నీ), మూడో వన్డే: డిసెంబర్ 2 (క్యాన్బెర్రా ), తొలి టీ20: డిసెంబర్ 4 (క్యాన్బెర్రా), రెండో టీ20: డిసెంబర్ 6 (సిడ్నీ), మూడో టీ20: డిసెంబర్ 8 (సిడ్నీ), తొలి టెస్ట్: డిసెంబర్ 17 నుంచి 21 (అడిలైడ్), రెండో టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 (మెల్బోర్న్), మూడో టెస్ట్: జనవరి 7 నుంచి 11 (సిడ్నీ), నాలుగో టెస్ట్: జనవరి 15 నుంచి 19 (బ్రిస్బేన్).