ఇన్స్టాగ్రామ్ పరిచయం: కలిసేందుకు వెళ్లిన యువతిని బావిలోకి తోసేశాడు, 3 రోజులు నరకం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లింది ఓ యువతి. అయితే, అక్కడకు వెళ్లిన తర్వాత అతడు ఆమెను 60 ఫీట్ల బావిలోకి తోసేశాడు. దీంతో ఆమె చేయి విరిగింది. ఎవరూ చూడకపోవడంతో బావిలో మూడు రోజులపాటు ఆమె నరకయాతన అనుభవించింది. ఎట్టకేలకు ఆమెను కాపాడిన ఫైర్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్ దేవనహళ్లిలో.. 22ఏళ్ల ఆ యువతి తన స్నేహితుడిని తొలిసారి ప్రత్యక్షంగా కలిసేందుకు వెళ్లినప్పుడు చోటు చేసుకుంది. కాగా, ఆ యువతి స్నేహితుడిని ఆదర్శ గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న విజయపుర పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధిత యువతి కోలార్ జిల్లా వాసిగా గుర్తించారు.
ఆదర్శను కలిసేందుకు వెళ్లిన బాధిత యువతిని సమీపంలోని బావిలోకి తోసేశాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె చేయి విరిగిందని చెప్పారు. అటువైపునకు ఎవరూ వెళ్లకపోవడంతో మూడు రోజులపాటు ఆహారం లేకుండా విరిగిన చేయితో నరకయాతన అనుభవించిందని పోలీసులు తెలిపారు. సోమవారం ఆమెను అగ్నిమాపక సిబ్బంది బావిలోంచి బయటకి తీసి కాపాడారని చెప్పారు.
Recommended Video
నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయపుర పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. సోషల్ మీడియాలో బాధితురాలు, నిందితుడికి చాలా రోజుల నుంచి పరిచయం ఉందని, ఈ నేపథ్యంలోనే కలుసుకునేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు.