కైలాసానికి విమానాలు: ఎక్కడి నుంచో తెలుసా?: త్రీ డేస్ ఫుల్..అన్నీ ఫ్రీ: రాసలీలల నిత్యానంద
బెంగళూరు: అత్యంత వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మరో సంచలన ప్రకటన చేశారు. అత్యాచార ఆరోపణలతో అరెస్టులు, కోర్టు కేసులను ఎదుర్కొంటోన్న ఆయన దేశం విడిచి పారిపోయారు. సరికొత్త దేశాన్ని సృష్టించారు. ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి విమాన సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని నిత్యానంద స్వయంగా వెల్లడించారు. కైలాస పేరుతో తాను సృష్టించిన దేశాన్ని సందర్శించాలనుకునే తన భక్తుల కోసం కొత్తగా ఛార్టెడ్ ఫ్లయిట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు నిత్యానంద తెలిపారు.
Recommended Video
ఉచిత సేవలు..
ఆస్ట్రేలియా నుంచి ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా నుంచి తన కైలాస దేశానికి ఉచితంగా సందర్శకులను తీసుకెళ్తామని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఇస్తామని, అనంతరం ఎవ్వరైనా సరే.. తిరిగి వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని షరతును విధించారు. అక్కడ ఉన్న మూడు రోజులూ ఉచిత ఆహారం, నివాస వసతిని కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికతను అలవర్చడానికే ఉచిత సేవలను కల్పించినట్లు పేర్కొన్నారు.
విసా చాలా ఈజీ అట..
తమ దేశ విసాల కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, అధికారిక వెబ్సైట్లో విసా దరఖాస్తు కోసం ఇమెయిల పంపించితే సరిపోతుందని అన్నారు. సందర్శకులు పంపించిన ఇమెయిల్ ఆధారంగా వారికి తాము విసాను మంజూరు చేస్తామని తెలిపారు. కైలాస పాస్పోర్ట్, జాతీయ పతాకాన్ని నిత్యానంద ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా ఆయన kailaasa.org పేరుతో వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. కైలాస దేశానికి సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందుపరిచారు.
దేశం విడిచి పారిపోయి.. కొత్త దేశమే ఏర్పాటు..
తన ఆశ్రమంలో పనిచేస్తోన్న ఇద్దరు గుజరాతీ అమ్మాయిలపై అత్యాచారం చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. నిత్యానందపై చర్యలు తీసుకోవాలంటూ వారు గుజరాత్ హైకోర్టులో వారు కేసు దాఖలు చేశారు. దీనితో న్యాయస్థానం నిత్యానందకు సమన్లు జారీ చేసింది. వెంటనే అరెస్టు చేయాలంటూ ఆదేశించింది. ఈ విషయం తెలుసుకున్న నిత్యానంద.. రాత్రికి రాత్రి దేశం విడిచి పారిపోయారు. ఏకంగా ఓ దేశాన్నే సృష్టించారు. పాస్పోర్ట్, జాతీయ పతాకాన్ని సృష్టించారు. తన కైలాస దేశానికి అధికారిక గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. కరెన్సీనీ ప్రకటించారు.
ఎక్కడుందా కంట్రీ ఆఫ్ కైలాస
ఈక్వెడార్ సమీపంలో ఓ ద్వీపాన్ని కొనుగోలు చేసిన నిత్యానంద దానికి `కంట్రీ ఆఫ్ కైలాస`గా పేరు పెట్టారు. తన సొంత దేశంగా ప్రకటించుకున్నారు. ఈ భూమండలంపై ఉన్న అన్ని దేశాల్లో లభించని ఆధ్యాత్మిక గొప్పదనం, ఆత్మ సంతృప్తి తన దేశంలో మాత్రమే లభిస్తుందని వెల్లడించారు. అతి గొప్ప హిందూ దేశంగా దాన్ని మార్చబోతోన్నట్లు వెల్లడించాడు. ప్రతి హిందువుకు ఈ దేశంపై సర్వహక్కులు ఉన్నాయంటూ తన అధికారిక వెబ్సైట్లో రాసుకొచ్చారాయన.