Bangalore Air Show 2021:విమానాయాన రంగంలో జీఎంఆర్ మరో అడుగు..ఆ సంస్థతో ఒప్పందం..!
ప్రముఖ సంస్థ జీఎంఆర్ గ్రూప్ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఏవియేషన్ రంగంలో సేవలు, టెక్నాలజీ, మరియు ఇన్నోవేషన్కు సంబంధించి సంయుక్తంగా పనిచేసేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరులో జరుగుతున్న ఏరోఇండియా 2021 వేదికగా ఈ అవగాహన ఒప్పందం జీఎంఆర్-ఎయిర్బస్ సంస్థల మధ్య జరిగింది. నిర్వహణ, భాగాలు, శిక్షణ, డిజిటల్ మరియు విమానాశ్రయ సేవలతో సహా విమానయాన రంగంలో రెండు సంస్థలు కలిసి వ్యూహాత్మకంగా పనిచేస్తాయి. దేశంలో విమానాయాన సంస్థ బలోపేతంకు రెండు సంస్థలు కృషి చేయనున్నాయి.
ఫోటోలు: బెంగళూరులో ఏరో ఇండియా 2021 ..విమానాల విన్యాసాలు
ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, సృజనాత్మకతతో కూడిన కొత్త ఆవిష్కరణల కోసం ఎయిర్ బస్ జీఎంఆర్ గ్రూపులు కలిసి పనిచేస్తాయని జీఎంఆర్ సౌత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్జీకే కిషోర్ చెప్పారు. కార్గో విభాగంలో కూడా ఒకరికొకరం సహకరించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని కిషోర్ చెప్పారు. కార్యాచరణ సామర్థ్యం మరియు ఆవిష్కరణల యొక్క అధిక ప్రమాణాలకు ఎయిర్బస్ మరియు జిఎంఆర్ గ్రూప్ కట్టుబడి ఉన్నాయని చెప్పారు ఎయిర్ బస్ ఇండియా మరియె సౌత్ ఏషియా ఎండీ రెమి మెలార్డ్. ఈ భాగస్వామ్యం ద్వారా ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి విమాన సేవలను అందించేందుకు కృషి చేస్తామన్నారు.
ఇదిలా ఉంటే బుధవారం రోజున బెంగళూరులోని ఎలహంకలో ప్రారంభమైన ఏరో ఇండియా 2021 చాలామందిని ఆకట్టుకుంది. పలు విమానాల విన్యాసాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఆకాశంలో రంగురంగుల పొగలు చిమ్ముతూ విమానాలు చేసిన విన్యాసాలను ప్రజలు ఆసక్తితో తిలకించారు. శుక్రవారం వరకు ఈ ఏరో ఇండియా 2021 కొనసాగుతుంది. ఏరో ఇండియా 2021 ద్వారా భారత రక్షణ శాఖ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అమెరికా మిలటరీకి చెందిన విమానాలు కూడా ఈ షోలో పాల్గొనడం విశేషం. ఇప్పటికే రక్షణ రంగంలో అమెరికా భారత్ బంధం బలంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడుతుందని రెండు దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.