ముగ్గురి మరణానికి దారి తీసిన బెంగళూరు అల్లర్లు: నిందితుడి అరెస్ట్: ఫేస్బుక్ పోస్ట్: ఎవరంటే?
బెంగళూరు: బెంగళూరులో చోటు చేసుకున్న అల్లర్లలో మరణించిన వారి సంఖ్య మూడుకు పెరిగింది. బెంగళూరులో అల్లర్లకు పాల్పడిన వారిని చెదరగొట్టడానికి పోలీసులు నిర్వహించిన కాల్పుల్లో మొదట ఇద్దరు మరణించారు. నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పులకేశినగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడి చేసి, తగులబెట్టిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనకు అసలు కారకుడైన నవీన్ అనే వ్యక్తిని కేజీ హళ్లి పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరులో అల్లర్లు: ఎమ్మెల్యే ఇంటికి నిప్పు: కాల్పుల్లో 2 మృతి: రాళ్ల దాడి: 60 మంది పోలీసులకు
నవీన్ మరెవరో కాదు.. అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు. మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ తన ఫేస్బుక్లో చేసిన ఓ పోస్ట్ ఈ అల్లర్లకు దారి తీసింది. పోలీసులు కాల్పులు జరిపేంతటి స్థితిని తీసుకొచ్చింది. నవీన్ను అరెస్టు చేయలంటూ ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేసినట్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిని తగులబెట్టడం, దానికి అనుబంధంగా కేజీ హళ్లి పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడిన వాహనాలను నిప్పంటించిన ఘటనలో ఇప్పటిదాకా పోలీసులు 110 మందిని అరెస్టు చేశారు.
మరి కొందరిని అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు. కేజీ హళ్లి పోలీస్ స్టేషన్, అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తిస్తున్నామని కమల్ పంత్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అదుపులోనే ఉన్నట్లు చెప్పారు. స్థానికులు శాంతియుతంగా ఉండాలని ఆయన విజ్ఙప్తి చేశారు. అఖండ శ్రీనివాస మూర్తి నివాసం ఉంటోన్న కావల్ బైరసంద్రతో పాటు కేజీ హళ్లి, బాణసవాడి, నాగవార, వినోభా నగర్, కాడుగొండనహళ్లిల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. డీజే హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ అమల్లో ఉంది.
Recommended Video
అల్లర్లను నియంత్రించడానికి పోలీసులు నిర్వహించిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. దీనితో ఆగ్రహించిన వారు కేజీ హళ్లి పోలీస్స్టేషన్పై దాడికి పాల్పడ్డారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 60 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో అఖండ శ్రీనివాస మూర్తి ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. ప్రజలు శాంతిని, సంయమనాన్ని పాటించాలని శ్రీనివాస మూర్తి విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని అన్నారు.