మరో ఘోరం: వ్యక్తిని స్కూటీతోపాటు 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు(వీడియో)
బెంగళూరు: దేశ రాజధానిలో ఓ మహిళను కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే కర్ణాటకలోని బెంగళూరులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోసహళ్లి ప్రాంతంలో సుమో డ్రైవర్తో గొడవపడి.. ఆ తర్వాత అతడ్ని తన స్కూటర్ తోపాటు సుమారు 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు ద్విచక్రవాహనదారుడు. ఈ ఘటనతో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, రోడ్డు రాంగ్ సైడ్ నుంచి వచ్చి టాటా సుమోను ఢీకొట్టాడు స్కూటరిస్టు. ఆ తర్వాత సుమో డ్రైవర్ తో గొడవ పడ్డాడు. రాంగ్ రూట్ లో ఎందుకు వచ్చావని ప్రశ్నించడంతో సుమో డ్రైవర్పై మండిపడిన స్కూటరిస్టు.. అతడ్ని తన బండితోపాటు వందమీటర్లపాటు ఈడ్చుకెళ్లాడు.
'బాధితుడు ప్రస్తుతం నగర ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నాడు. ద్విచక్ర వాహన డ్రైవర్ను పీఎస్ గోవిందరాజ్ నగర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు' అని పశ్చిమ బెంగుళూరు డీసీపీ తెలిపారు. కాగా, నిందితుడి వాహనం బెంగళూరు సౌత్ ఆర్టీఓ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉంది. అతడు బయటరాయణపుర నివాసి. నిందితుడిని గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు.
బీజేపీ నేత, మంత్రి వీ సోమన్న ఆస్పత్రిలో క్షతగాత్రుడిని పరామర్శించారు. గాయపడిన వ్యక్తిని ముత్తప్పగా గుర్తించారు. బాధితుడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. బాధితుడికి నడుము కింద, మోకాళ్లు, కాళ్లపై గాయాలయ్యాయి. అధిక రక్తస్రావం కారణంగా బాధితుడు చాలా రక్తాన్ని కోల్పోయాడని వైద్యులు తెలిపారు.
#WATCH | Man being dragged behind a scooter on Bengaluru's Magadi road
— ANI (@ANI) January 17, 2023
The victim is currently under medical treatment a city hospital. The two-wheeler driver has been apprehended by the police at PS Govindaraj Nagar: DCP West Bengaluru
(Video verified by Police) pic.twitter.com/nntPxaZxSu
అయితే, గుంతలతో నిండిన రహదారిలో 100 మీటర్లకు పైగా దూరం ఈడ్చుకెళ్లినప్పటికీ.. టాటా సుమో డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని పట్టుకొని ఉన్నాడు. కొందరు వెంబడించడంతో చివరకు స్కూటర్ను ఆపాడు నిందితుడు. ఆ తర్వాత, తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు.
ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రత్యక్ష సాక్షులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. దీంతో బాధితుడితోపాటు నిందితుడు కూడా ఆస్పత్రిలో చేరాడు. నిందితుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.