బెంగళూరు అల్లర్లు: కీలక కుట్రదారును అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, 30 ప్రాంతాల్లో తనిఖీలు
బెంగళూరు: బెంగళూరు అల్లర్ల కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) పురోగతి సాధించింది. అల్లర్ల కీలక కుట్రదారును గురువారం అరెస్ట్ చేసింది ఆగస్టు 11న కడుగోదనహళ్లి(కేజీ హళ్లి) పోలీస్ స్టేషన్పై దాడి ఘటనలో ఇతడి పాత్ర కీలకమని గుర్తించారు.
ఎన్ఐఏ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 11 నుంచి తప్పించుకు తిరుగుతున్న దాడుల కీలక కుట్రదారు సయ్యద్ సద్దిఖ్ అలీ(44)ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఓ బ్యాంక్ రికవరీ ఏజెంట్గా ఇతడు పనిచేస్తున్నట్లు గుర్తించామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అల్లర్ల అనంతరం ఇతడు పరారీలో ఉన్నాడని చెప్పారు.
కాగా, కేజీ హళ్లి, దేవరజీవనహళ్లి(డీజే హళ్లి) పోలీస్ స్టేషన్లపై దాడులకు సంబంధించి నగరంలోని 30 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎయిర్గన్, పిల్లెట్లు, పదునైన ఆయుధాలు, ఐరన్ రాడ్స్, డిజిటల్ డివైజ్లు, డీవీఆర్స్ (డైనమిక్ విజన్ రీసోర్సెస్) , ఇంకా ఎస్డీపీఐ(సోషల్ డిమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా), పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)లకు సంబంధించిన చాలా నేరారోపణకు సంబంధించిన పత్రాలు, మెటీరియల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
ఆగస్టు 11న కవల్ బైరసంద్రలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ ముస్లింలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారనే ఆరోపణలతో ఆ ఎమ్మెల్యే ఇంటి ముందు సుమారు వెయ్యి మంది ఆందోళనకారులు చేరి విధ్వంసం సృష్టించారని తెలిపింది.ఎమ్మెల్యే ఇంటితోపాటు రెండు పోలీస్ స్టేషన్ల విధ్వంసంలో ఎస్ డీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముజమిల్ పాషా, ఎస్డీపీఐ, పీఎఫ్ఐ ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారని వెల్లడించారు.
ఐజీ ర్యాంక్ అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్ఐఏ బృందం ఇప్పటికే రెండు పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు నమోదు చేసింది. కాగా, బెంగళూరు అల్లర్లపై కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్ప ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నలుగురి ప్రాణాలు పోవడంతోపాటు భారీ ఆస్తి నష్టం చేసిన ఈ అల్లర్లకు కారణమైన వారి నుంచే నష్టపరిహారాన్ని వసూలు చేసేందుకు క్లెయిమ్ కమిషనర్ ను నియమించేందుకు హైకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం.