బెంగళూరు అల్లర్లలో కుట్ర: ఫస్ట్ వికెట్: పక్కా స్కెచ్: బీజేపీ మంత్రి డౌట్: ఎస్డీపీఐ నేత అరెస్ట్
బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందా? మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే వందలాదిమంది ఎలా గుమికూడగలిగారు? కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటిని ఎలా తగులబెట్టగలిగారు? పోలీస్స్టేషన్పై ఎలా దాడి చేయగలిగారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ ఒక్క ముక్కలో సమాధానం ఇచ్చారు కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి. బెంగళూరులో చోటు చేసుకున్న అల్లర్ల వెనుక కుట్ర కోణం దాగి ఉందని అన్నారు.
ముగ్గురి మరణానికి దారి తీసిన బెంగళూరు అల్లర్లు: నిందితుడి అరెస్ట్: ఫేస్బుక్ పోస్ట్: ఎవరంటే?
గంటలోనే వేలాది మంది
పక్కా స్కెచ్ ప్రకారమే.. పథకం ప్రకారమే ఈ దాడులు చోటు చేసుకున్నాయనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. తాను లేవనెత్తిన కోణంలో పోలీసులు దర్యాప్తు సాగించాలని అన్నారు. తనకు అందిన సమాచారం ప్రకారం..ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటిపై ఒక వర్గానికి చెందిన వారు ఉద్దేశపూరకంగా దాడి చేసినట్లు అనుమానిస్తున్నానని చెప్పారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచినట్టుగా భావిస్తోన్న వ్యాఖ్యలు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే వేలాదిమంది ఎలా ఒకేచోట గుమికూడగలిగారని సీటీ రవి ప్రశ్నించారు. అల్లరి మూక దాడుల్లో 200 నుంచి 300 వాహనాలు ధ్వంసం అయ్యాయని అన్నారు.
ఎస్డీపీఐ నేత అరెస్ట్
అఖండ శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు వాహనాలను తగులబెట్టడానికి అవసరమైన సామాగ్రిని ఆందోళనకారులు ఎలా సమకూర్చుకోగలిగారని ప్రశ్నించారు. ఇదొక వ్యవస్థీకృత దాడిగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. దీని వెనుక సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) హస్తం ఉందని సీటీ రవి ఆరోపించారు. సీటీ రవి ఎస్డీపీఐపై అనుమానాలను వ్యక్తం చేసిన సమయంలోనే బెంగళూరు నగర పోలీసులు.. అదే సంఘానికి చెందిన నేతను అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎస్డీఐపీ కన్వీనర్ ముజామిల్ పాషాను పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఎస్డీపీఐ బ్యాక్గ్రౌండ్ ఏంటీ?
సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా..కేరళలో కాస్త బలంగా ఉన్న ఆర్గనైజేషన్ ఇది. ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు ఏర్పాటు చేసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి అనుబంధంగా ఎస్డీపీఐ పని చేస్తోంది. కేరళలో కన్నూర్, కాసర్గాడ్ వంటి కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. కర్ణాటక, తమిళనాడుల్లో ఓ మోస్తరు స్థాయిలో ఉనికిలో ఉంటోంది. ఈ సంస్థే ఇప్పుడు ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై, డీజే హళ్లి పోలీస్ స్టేషన్పై దాడులు చేయడానికి కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కన్వీనర్ ముజామిల్ పాషాను పోలీసులు అరెస్టు చేశారు.
Recommended Video
ముగ్గురి మరణానికి దారి తీసిన అల్లర్లు..
అల్లర్లను నియంత్రించడానికి పోలీసులు నిర్వహించిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. దీనితో ఆగ్రహించిన వారు కేజీ హళ్లి పోలీస్స్టేషన్పై దాడికి పాల్పడ్డారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 60 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో అఖండ శ్రీనివాస మూర్తి ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. ప్రజలు శాంతిని, సంయమనాన్ని పాటించాలని శ్రీనివాస మూర్తి విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారని అన్నారు.