Bharat Bandh: రాష్ట్రపతికి 9 లక్షల పోస్టు కార్డులు పంపించిన రైతులు, అక్కడ బీజేపీ ఎఫెక్ట్, రాహుల్ గాంధీతో !
బెంగళూరు/ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ నేడు (మంగళవారం) భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని మనవి చేస్తూ భారత రాష్ట్రపతికి 9 లక్షల మంది రైతులు పోస్టు కార్డులు రాశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి దేశంలోని అన్నదాతలను ఆదుకోవాలని 9 లక్షల మంది రైతులు ఆవేదనతో పోస్టు కార్డులు రాసి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారి గోడు వినిపించారు.
కేవలం బీజేపీ అధికారంలో ఉన్న ఒక రాష్ట్రం నుంచి 9 లక్షల పోస్టు కార్డులు రాష్ట్రతికి పంపించడం చర్చకు దారి తీసింది. రాహుల్ గాంధీ ద్వారా రాష్ట్రపతికి పోస్టు కార్డులు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
రైతుల వ్యతిరేకి ఈ కేంద్ర ప్రభుత్వం
రైతుల జీవితాలతో చెలగాటం ఆడటానికే కేంద్ర ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ చట్టాలను అమలు చేసిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్న రైతులకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ఇస్తున్నారు. మంగళవారం జరుగుతున్న భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీతో సహ 25 వివిద రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి.
రాష్ట్రపతికి పంపించాలని సంతకాల సేకరణ
వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మనవి చేస్తూ పోస్టు కార్డులు పంపించాలని కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కర్ణాటకలోని వివిద జిల్లాలోని రైతుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. 9 లక్షల మందికి పైగా రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుమనవి చేస్తూ పోస్టు కార్డుల మీద సంతకాలు చేశారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కర్ణాటకలోని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. భారత్ బంద్ కు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి రైతులను అడ్డుకుంటుందని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అందు కోసం రైతులు పోస్టుకార్డుల రూపంలో నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతికి లేఖలు పంపించారని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.
రాహుల్ గాంధీతో రాష్ట్రపతికి అందిస్తాం
కర్ణాటకలోని వివిద జిల్లాలోని రైతలు నుంచి సేకరించిన 9 లక్షల పోస్టు కార్డులను కిసాన్ మోర్చా అధ్యక్షుడు సచిన్ మిగాకు అందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ద్వారా ఈ 9 లక్షల పోస్టు కార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అందించి వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని మనవి చేస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ అన్నారు.
బీజేపీతో భయం?
కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ నాయకులు రైతుల నుంచి ఈ 9 లక్షల సంతకాల సేకరణ చేపట్టారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. భారత్ బంద్ లో ప్రజలు, బీజేపీకి మద్దతుగా ఉన్న రైతులు పాల్గొనరనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఇలా పోస్టు కార్డుల సంతకాల సేకరణ చేపట్టారని తెలిసింది.