బెంగళూరు ఎయిర్ షోలో ప్రత్యేకతలెన్నో: తొలిసారిగా అలాంటి మిస్సైల్
బెంగళూరు: ఉద్యాన నగరి బెంగళూరు..మరోసారి ఏరో ఇండియా షో కార్యక్రమానికి వేదికైంది. బెంగళూరు శివార్లలోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. వైమానిక, నౌకాదళాలు వినియోగించే రక్షణ పరికరాలు, అత్యాధునిక క్షిపణులను ప్రదర్శనకు ఉంచారు. వైమానిక దళాల అమ్ములపొదిలో ప్రధానాస్త్రాలైన బ్రహ్మోస్ క్షిపణి పరీక్షా వాహనాలు, సుఖోయ్ యుద్ధ విమానాల విన్యాసాలను ప్రదర్శించారు.
Recommended Video
ఇప్పటిదాకా వాయుసేన సేవలకే పరిమితమైన బ్రహ్మోస్ క్షిపణులు.. ఈ సారి నౌకాదళంలోకి కూడా ప్రవేశించబోతోన్నాయి. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.. త్వరలోనే నావికా దళంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ను బెంగళూరు ఎయిర్ షోలో ప్రదర్శనకు ఉంచారు. దాని శక్తి సామర్థ్యాలను నౌకాదళ అధికారులు.. రక్షణ మంత్రికి వివరించారు. ఈ ఎయిర్ షోలో ఇదే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
దానితో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన సుఖోయ్ ఎస్యు-30ఎంకేఐ ఫైటర్ జెట్ను ఎయిర్ షోలో ప్రదర్శించారు. సుఖోయ్ యుద్ధ విమానాల్లో ఇది లేటెస్ట్ వెర్షన్. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ను సంధించగల సామర్థ్యాలను దీనికి కల్పించారు. 400 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించే బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ను ఇది సంధించగలదు. యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలు సాగించిన విన్యాసాలు కట్టి పడేశాయి. జాతీయ పతాకాలను ఎగుర వేస్తూ వాటి విన్యాసాలు సాగాయి.
ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఫిప్త్ జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అడ్వాన్స్డ్ మీడియా కోంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నమూనాను ప్రదర్శనలో ఉంచారు. ఎయిర్ షోను ప్రారంభించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపు ప్రసంగించారు. రక్షణరంగంలో విదేశీ పెట్టబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచామని, ఫలితంగా మరింత అత్యాధునికమైన రక్షణ పరికరాలను రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
సరిహద్దుల నుంచి దేశం ముప్పును ఎదుర్కొంటోందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్, చైనాల నుంచి సరిహద్దు చొరబాట్ల గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. తాజాగా నిర్వహిస్తోన్న ఎయిర్ షో.. దేశ రక్షణ రంగ శక్తి సామర్థ్యాలను చాటుతోందని అన్నారు. అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ సత్తా చాటగల ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.