Bring back Rohini Sindhuri: కర్ణాటకలో మార్మోగిపోతోన్న తెలుగు ఐఎఎస్ అధికారిణి పేరు
బెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ, రాజకీయ నాయకులకు కొరుకుడుపడని కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి తాజా బదిలీ వ్యవహారం.. రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆమె పేరు ప్రస్తుతం కర్ణాటకలో మారుమోగిపోతోంది. రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు. మైసూరు డిప్యూటీ కమిషనర్ (జిల్లా కలెక్టర్)గా పనిచేస్తోన్న రోహిణి సింధూరిని అకారణంగా బదిలీ చేశారనే ఆగ్రహావేశాలు మైసూరు జిల్లా ప్రజల్లో వ్యక్తమౌతోన్నాయి. ఆన్లైన్ వేదికగా దాని ప్రదర్శిస్తోన్నారు. మళ్లీ పాత పోస్టింగే ఇవ్వాలంటూ నినదిస్తోన్నారు.
బ్రింగ్ బ్యాక్ రోహిణి సింధూరి
మైసూరు డిప్యూటీ కమిషనర్గా ఉన్న రోహిణి సింధూరిని ట్రాన్స్ఫర్ చేసింది యడియూరప్ప ప్రభుత్వం. దేవాదాయ శాఖ కమిషనర్గా నియమించింది. ఈ చర్య పట్ల ప్రజల్లో నిరసన పెల్లుబుకుతోంది. రోహిణిని మళ్లీ మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్గా నియమించాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్ పిటీషన్ వేశారు. బ్రింగ్ బ్యాక్ రోహిణి సింధూరి (Bring back Rohini Sindhuri) పేరుతో సంతకాలను సేకరిస్తోన్నారు. 1,50,000 సంతకాలను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య 90,000ను దాటింది.
కన్సర్న్డ్ సిటీజన్ ఆఫ్ ఇండియా..
కన్సర్న్డ్ సిటీజన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ సంతకాల సేకరణ చేపట్టింది. https://www.change.org/ అనే వెబ్సైట్ ద్వారా సంతకాలను సేకరిస్తోంది. రోహిణి సింధూరిని బదిలీ చేయడానికి గల కారణాలను వివరించింది. కొందరు పెద్దల అవినీతిని బయటపెట్టడానికి ప్రయత్నించడం వల్లే ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఆమెపై బదిలీ వేటు వేసిందని పేర్కొంది. తమ జిల్లా డిప్యూటీ కమిషనర్ను తమకు తెలియకుండా ప్రభుత్వం బదిలీ చేసిందని, దాన్ని తెలుసుకునే హక్కు మైసూరు ప్రజలకు ఉందని తెలిపింది. ఆమెను మళ్లీ పునర్నియమించేంత వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేసిందా సంస్థ.
దేవాదాయ శాఖకు
2009 బ్యాచ్.. కర్ణాటక కేడర్కు చెందిన రోహిణి సింధూరి ఇదివరకు మైసూరు జిల్లా కలెక్టర్గా పని చేశారు. మైసూరు సిటీ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న తోటి ఐఎఎస్ అధికారిణి శిల్పా నాగ్ ఆమెపై విమర్శలు చేయడం..తన సర్వీస్కు రాజీనామా చేయడం వంటి పరిణామాలు సంభవించాయి. ఆ వివాదం చెలరేగిన మూడో రోజే యడియూరప్ప ప్రభుత్వం రోహిణి సింధూరిని బదిలీ చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్గా నియమించింది ప్రభుత్వం. ఆమె స్థానంలో మైసూరు జిల్లా కలెక్టర్గా డాక్టర్ బాగాడి గౌతమ్ను నియమించింది. ఈ వివాదానికి కారణమైన ఎంసీసీ కమిషనర్ శిల్పా నాగ్ను కూడా బదిలీ చేసింది. ఆమెను గ్రామీణాభివృద్ధి-పంచాయతీ రాజ్ శాఖ ఈ-గవర్నెన్స్ విభాగం డైరెక్టర్గా నియమించింది.
ముఖ్యమంత్రిని కలిసినా..
మైసూరు డిప్యూటీ కమిషనర్ హోదా నుంచి వైదొలగడానికి రోహిణి సింధూరి ఇష్టపడలేదు. ఈ బదిలీని నిలిపివేయాలని కోరుతూ ఆమె స్వయంగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను సైతం కలిశారు. అయినప్పటికీ- ఫలితం రాలేదు. తాను ఈ బదిలీని ఆపలేనని, వెంటనే.. దేవాదాయ శాఖ కమిషనర్గా బాధ్యతలను స్వీకరించాలని ఆదేశించారు. రెండురోజుల కిందటే మైసూరును వదిలారు. దీనితో రోహిణికి మద్దతుగా కన్సర్న్డ్ సిటీజన్ ఆఫ్ ఇండియా తన ఆన్లైన్ క్యాంపెయిన్కు ప్రారంభించింది. సంతకాలను సేకరిస్తోంది.