విద్యార్థులపై కోవిడ్ ఫీజుల బాదుడు .. శానిటైజేషన్ కోసం బెంగుళూరు స్కూల్స్ నిర్ణయం
ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులను కరోనా ఫీజు పేరుతో బాదుడుకు రంగం సిద్ధం చేస్తున్నాయి . సెప్టెంబర్ 21 నుండి విద్యార్థులు అన్లాక్ 4 లో భాగంగా స్కూల్స్ కు వచ్చేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అవసరమైన శానిటైజేషన్ ఖర్చులను భరించటానికి విద్యార్థులపై అదనపు 'కోవిడ్ ఫీజు' విధించాలని బెంగళూరులోని ప్రైవేట్ పాఠశాలలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది .
కరోనా నిబంధలతో స్కూల్స్ నిర్వహణకు కేంద్రం నిర్ణయం
కరోనా నేపధ్యంలో పాఠశాలలు అనుసరించాల్సిన ప్రామాణిక విధానాలను కేంద్రం మంగళవారం ప్రకటించింది. ఇందులో కోవిడ్ సదుపాయాలు కల్పించాల్సిందిగా కూడా పేర్కొంది. స్కూల్స్ ను శుభ్రం చెయ్యటం , శానిటైజేషన్ , సామాజిక దూరాన్ని నిర్ధారించడానికి గుర్తులను ఏర్పాటు చేయడం, ఎంట్రీ పాయింట్ల వద్ద శానిటైజర్ స్టేషన్లు పెట్టటం మొదలైనవి ఉన్నాయి. 9 నుంచి 12 తరగతులకు మాత్రమే దశలవారీగా మరియు స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాలలు తిరిగి తెరవవచ్చని ప్రభుత్వం సర్క్యులర్లో పేర్కొంది. ఈ నేపధ్యంలో కరోనా ఫీజుగా శానిటైజేషన్ పేరుతో విద్యార్థుల మీద అదనపు భారం వెయ్యటానికి సిద్ధం అవుతున్నారు.
కరోనా ప్రోటోకాల్స్ కోసం తల్లిదండ్రులపై భారం మోపనున్న ప్రైవేట్ స్కూల్స్
తప్పనిసరి కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాల్సిన నేపధ్యంలో బెంగళూరులోని ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతున్న ఖర్చుల భారం తల్లిదండ్రులపై మోపనుంది . విద్యార్థులు తరచూ ఉపయోగించే ప్రాంతాలు , రెయిలింగ్లు, డెస్కులు, కుర్చీలు మరియు పరికరాలు వంటివి నిరంతరం శుభ్రం చెయ్యటానికి , శానిటైజ్ చెయ్యటానికి , నిత్యం శుభ్రం చెయ్యటానికి ప్రైవేట్ స్కూల్స్ పై పడే అదనపు భారం తల్లి దండ్రులపై వెయ్యటాన్ని తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఆర్ధిక కష్టాల్లో ఉంటే , కరోనా ఫీజులా అని మండిపడుతున్నారు.
థర్మల్ స్క్రీనింగ్ లు , శానిటైజర్లు , వసతుల కోసం కోవిడ్ ఫీజు వసూలు నిర్ణయం
కరోనా సమయంలో స్కూల్స్ నిర్వహణ కష్టం అంటున్నారు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు . కొన్ని పాఠశాలలు తల్లిదండ్రుల నుండి అదనపు ‘కోవిడ్ ఫీజులు' వసూలు చేస్తే పిల్లలను సురక్షితంగా ఉంచడానికి వీలవుతుంది అంటున్నారు . ఇది నిజంగా ఖర్చుతో కూడుకున్న పని అని , ఎందుకంటే థర్మల్ స్కానర్లు, శానిటైజర్లు మరియు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే స్కూల్స్ నిర్వహణ సాధ్యం అవుతుంది. అదనంగా పడే భారం తమ పిల్లల రక్షణ కోసం తల్లిదండ్రులు భరించాల్సి ఉంటుందని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు చెప్తున్నాయి.
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు తల్లిదండ్రుల పరిస్థితి
నిన్నా మొన్నటి దాకా దేశ వ్యాప్త లాక్ డౌన్ తో ప్రజల ఆర్ధిక స్థితి అంతంత మాత్రంగా తయారైంది . ఇప్పుడు పిల్లల చదువులు , ఫీజులు అంటూ అదనపు భారం కూడా పడనుంది . ఇదే సమయంలో కరోనా నేపధ్యంలో జాగ్రత్తలు తీసుకోవటానికి కోవిడ్ ఫీజులు వసూలు చెయ్యనున్న పరిస్థితి మరింత ఇబ్బందికర పరిణామం . ప్రభుత్వాలు విద్యార్థులు ఆరోగ్య రక్షణకు కావాల్సిన వనరులను సమకూరిస్తే బాగుంటుంది అని అటు తల్లిదండ్రులు , ఇటు స్కూల్స్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. అలా సాధ్యం కాని పరిస్థితిలో కోవిడ్ ఫీజు వసూలు చెయ్యటం తప్ప వేరే దారి లేదంటున్నాయి.