మాజీ ప్రధాని దేవె గౌడకు భారీ షాక్: ఎన్ఐసీఈకి రూ. 2 కోట్లు చెల్లించాలంటూ కోర్టు తీర్పు
బెంగళూరు: మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టులో చుక్కెదురైంది. పదేళ్లనాటి వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రూ. 2 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2011 జూన్ 28న 'గౌడర గర్జన' పేరుతో ఓ కన్నడ ఛానల్లో దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారమైంది. నాటి ఇంటర్వ్యూలో నంది ఇన్ఫ్రాక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్(ఎన్ఐసీఈ) ప్రాజెక్టుపై దేవెగౌడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు.
దేవెగౌడ వ్యాఖ్యలతో తమ పరువుకు భంగం కలిగిందంటూ దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు సెషన్స్ కోర్టు.. నంది ఇన్ఫ్రాక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్(ఎన్ఐసీఈ) ఆరోపణల్లో నిజం ఉందని గుర్తించింది.
నంది ఇన్ఫ్రాక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్(ఎన్ఐసీఈ) ప్రాజెక్టును గతంలో కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టు తమ తీర్పుల్లో సమర్థించాయని బెంగళూరు కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ఇది కర్ణాటక ప్రజల ప్రయోజనాల కోసం కంపెనీ చేపట్టిన పెద్ద ప్రాజెక్టు అని స్పష్టం చేసింది.
ఇలాంటి ప్రాజెక్టుపై పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతిస్తే ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రాజెక్టు ఆలస్యమవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేగాక, కంపెనీ పరువుకు భంగం కలిగించినందుకు గానూ నంది ఇన్ఫ్రాక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్(ఎన్ఐసీఈ)కి దేవెగౌడ రూ. 2 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.