Drug mafia: నాకు ఏపాపం తెలీదు, నో బెయిల్, రాగిణికి రాగిపిండి, సంజనాకు సద్దపిండి, సైలెంట్!
బెంగళూరు/ ముంబాయి/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ కేసులో స్యాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి ద్వివేదికి చుక్కెదురైయ్యింది. నాకు ఏపాపం తెలీదు, ఈ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు బెయిల్ ఇవ్వండి అంటూ రాగిణి కోర్టును ఆశ్రయించింది. అయితే రాగిణికి ఈ పాపంతో సంబంధం ఉంది, బెయిల్ ఇవ్వకండి అంటూ పోలీసులు కోర్టుకు మనవి చేశారు.
రాగిణికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఇదే సమయంలో ఇన్ని రోజులు నానా రచ్చ చేసిన నటి సంజనా బెయిల్ కోసం అప్పీలు చెయ్యకుండా సైలెంట్ అయిపోవడంతో అందరూ షాక్ కు గురైనారు. ఇంకా కొన్ని రోజులు రాగిణికి రాగిపిండి, సంజనాకు సద్దపిండి గ్యారెంటీ అని వెలుగు చూసింది.
Drug Mafia: సినీతారలే కాదు, లీడర్స్ కు లింక్, బాంబు పేల్చిన మాజీ సీఎం, సిట్టింగ్ సీంతో చర్చలు!
క్రైమ్ బ్రాంచ్ కస్టడీలో రాగిణి
బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో బహుబాష నటి, స్యాండిల్ వుడ్ హనీబేబి రాగిణిని సెప్టెంబర్ 4వ తేదీన బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. రాగిణి ఇంటిలో సోదాలు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ లు సీజ్ చేశారు. రాగిణి బెడ్ రూమ్ లో పోలీసులు గంజాయితో నింపిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి రాగిణి ద్వివేదిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు.
కస్టడీ గడువు సమాప్తం
సెప్టెంబర్ 14వ తేదీ సోమవారంతో రాగిణి పోలీసు కస్టడీ గడుపు పూర్తి అయ్యింది. ఇదే సమయంలో ఈ డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలు, తనకు బెయిల్ మంజూరు చెయ్యాలి అంటూ రాగిణి ఆమె తరపు న్యాయవాదులతో బెంగళూరులోని ఎన్ డీపీఎస్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
రాగిణి మేడమ్ కు నో బెయిల్
నటి రాగిణికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని, ఆమె డ్రగ్స్ సేవించినట్లు మా దగ్గర సాక్షాలు ఉన్నాయని, ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యకూడదని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టులో మనవి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం రాగిణి బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
కస్టడీనా ? లేక పరప్పన అగ్రహార జైలా
నటి రాగిణిని వారం రోజులకు పైగా విచారణ చేసిన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను మరోసారి కస్టడీకి తీసుకోవడం అనుమానమే అని తెలిసింది. ఇప్పటికే రాగిణికి వైద్యపరీక్షలు పూర్తి అయ్యాయి. రాగిణికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో పోలీసులు కస్టడీకి అవసరం లేదు అని చెబితే ఆమెను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే కోర్టు ఆదేశాలు జారీ అయ్యే వరకు వేచి చూడాలని పోలీసులు నిర్ణయించారు.
సంజనా మేడమ్ సైలెంట్
స్యాండిల్ వుడ్ బ్యూటీలు రాగిణి, సంజనాల పోలీసు కస్టడీ నేటితో పూర్తి కానుంది. రాగిణి బెయిల్ తీసుకోవాలని ప్రయత్నాలు చేసినా సంజనా మాత్రం బెయిల్ కోసం ఇప్పటి వరకు కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యలేదు. బెయిల్ కోసం సంజనా ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు ? అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.
Recommended Video
రాగిణికి రాగిపిండి.... సంజనాకు సద్దపిండి
తనకు ఈ డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అంటూ వైద్యపరీక్షలు చేసుకునే సమయంలో నానా రచ్చ చేసిన సంజనా సైలెంట్ అయిపోవడం వెనుక అసలు కారణం ఏమిటి ? అనే విషయం అంతుచిక్కడం లేదని తెలిసింది. డ్రగ్స్ మాఫియా కేసులోనే అరెస్టు అయిన ప్రముఖ వ్యాపారి వైభవ్ జైన్ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మరో నిందితుడు రాహుల్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. మొత్తం మీద ఇంకా కొన్ని రోజులు నటి రాగిణికి రాగిపిండి, సంజనాకు సద్దపిండి గ్యారెంటీ అని వెలుగు చూసింది.