Hitech gambling: కడప శశి ఎవరు ?, 80 మంది అరెస్టు, ఆంధ్రా, తెలంగాణ, రూ. కోట్లు డీలింగ్, ఎంట్రీ!
బెంగళూరు/ కడప/ హైదరాబాద్: ప్రముఖ హోటల్ లో అక్రమంగా హైటెక్ గ్యాంబ్లింగ్ కేంద్రం నిర్వహిస్తారని వెలుగు చూసింది. పోలీస్ ఇన్స్ పెక్టర్ అండతోనే కడపకు చెందిన శశి అనే వ్యక్తి ఈ హైటెక్ దందా నిర్వహిస్తున్నాడని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఎంట్రీ ఫీజు రూ. 5 వేలు పెట్టి పేకాటరాయుళ్లు ప్రతిరోజు కోట్ల రూపాయలు చేతులు మార్చుకుంటున్నారని, ఈ హైటెక్ దందాకు పోలీస్ ఇన్స్ పెక్టర్ అండగా ఉన్నాడని వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరుకు చెందిన 80 మందిని అరెస్టు చేసి రూ. 85 లక్షల నగదు, 87 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్ పెక్టర్ ను ఇంటికి పంపిస్తూ ఆదేశాలు జారీ చేశామని సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు.
Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!
లక్షల మంది టెక్కీలు, వ్యాపారులు
బెంగళూరు నగరంలో కొన్ని లక్షల మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. ఇకపోతే ఎడాపెడా డబ్బులు సంపాదిస్తున్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పలు రంగాలకు చెందిన శ్రీమంతులు ఎంత మంది ఉంటారో లెక్క వెయ్యడం చాలా కష్టం. ప్రతిరోజు బెంగళూరులో చట్టబద్దంగా వేల కోట్ల రూపాయల ఆర్థికలావాదేవీలు జరుగుతుంటాయి. ఇక చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కొదవలేదని ఆరోపణలు ఉన్నాయి.
బెంగళూరు ఇన్ హోటల్
బెంగళూరులోని మహదేవపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డనక్కుంది ప్రాంతంలో స్టార్ హోటల్స్ ఉన్నాయి .ఇక్కడే బెంగళూరు ఇన్ అనే హోటల్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఎప్పుడుపడితే అప్పుడు లెక్కలేనంతమంది విలాసవంతమైన కార్లలో బెంగళూరు ఇన్ హోటల్ కు వచ్చి వెలుతున్నారని, వీళ్లు అక్కడ ఏం చేస్తున్నారు ? అంటూ స్థానికులకు అనుమానం రావడంతో పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.
క్రైమ్ బ్రాంచ్ ఎంట్రీతో థ్రిల్లర్ సినిమా
బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు బెంగళూరు ఇన్ హోటల్ మీద నిఘా వేశారు. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ విభాగం డీసీపీ కేపి. రవికుమార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్ కోర్టులో సర్చ్ వారెంట్ తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా దోడ్డనక్కుంది ఏరియాలోని బెంగళూరు ఇన్ హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే అక్కడ జరుగుతున్న తతంగం చూసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ కు గురైనారు.
ఆంధ్రా, తెలంగాణ జల్సారాయుళ్లు అరెస్టు
బెంగళూరు ఇన్ హోటల్ లో పేకాట రూపంలో లక్షల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. పేకాట కేంద్రంలో ఉన్న పేకాటరాయుళ్లు దర్జాగా బెట్టింగ్ ల మీద బెట్టింగ్ లు కడుతూ పేకాట ఆడుతున్న విషయం పోలీసులు గుర్తించారు. బెంగళూరు ఇన్ హోటల్ లో పేకాట ఆడుతున్న బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 80 మందిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. పేకాటరాయుళ్ల దగ్గర రూ. 85 లక్షల నగదు, 87 గ్రాముల బంగారు నగలు, విలువైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కడప శశి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లోని కడపకు చెందిన శశి అనే వ్యక్తి బెంగళూరు ఇన్ హోటల్ లో హైటెక్ పేకాటకేంద్రం నిర్వహిస్తున్నాడని మా విచారణలో వెలుగు చూసిందని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అన్నారు. బెంగళూరు ఇన్ హోటల్ లోని ఫంక్షన్ హాల్ లో పేకాట కేంద్రం నిర్వహిస్తున్నారని, అక్కడ ఎంట్రీ ఫీజు రూ. 5 వేలు ఫిక్స్ చేశారని విచారణలో వెలుగు చూసిందని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రవికుమార్ తెలిపారు. కడపకు చెందిన శశి అనే వ్యక్తి ఈ పేకాట కేంద్రం కింగ్ పిన్ అని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అన్నారు.
ఇన్స్ పెక్టర్ హస్తం..... వెంటనే ఇంటికి!
దోడ్డనక్కుందిలోని బెంగళూరు ఇన్ హోటల్ లో విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నారని మహదేవపుర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ అశ్వథ్ నారాయణస్వామికి, హెడ్ కానిస్టేబుల్ జయకిరణ్ కు ముందే తెలుసని, విధులు దుర్వినియోగం చెయ్యడమే కాకుండా వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. మహదేవపుర పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ అశ్వథ్ నారాయణస్వామితో పాటు హెడ్ కానిస్టేబుల్ జయకిరణ్ ను సస్పెండ్ చేస్తూ బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు విచారణలో ఉంది.