పెళ్లి చేస్తానని పిలిచి కూతురి ప్రియుడిని చంపేశారు - కర్నాటకలో మరో పరువు హత్య..
కర్నాటకలో తాజాగా మరో పరువు హత్య చోటు చేసుకుంది. బెంగళూరు శివార్లలో జరిగిన ఈ పరువు హత్యకు మూలం మతాంతర ప్రేమ. తమ మతం కాని వాడిని కూతురు ప్రేమించిందని తెలుసుకున్న కసాయితండ్రి.. పెళ్లిపై చర్చిద్దామని పిలిచి కొడుకు, అతని స్నేహితుల సాయంతో అతడిని కిరాతకంగా గొంతు నులిమి చంపేశారు.
కర్నాటకలో రెండు వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు యువతీ యువకులు గత నెలలో ప్రేమించుకుని పారిపోయారు. వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించిన యువతి తండ్రి చివరికి అతని ఫోన్ నంబర్ సంపాదించి కాల్ చేశాడు. తన కుమార్తెను తీసుకుని పారిపోవడం సరికాదని, తన వద్దకు వస్తే చర్చించి పెళ్లి చేస్తానని నమ్మించాడు. ఆ మాటల్ని నమ్మి బెంగళూరు శివార్లకు వెళ్లిన ప్రియుడు ప్రియురాలి తండ్రి, అన్న, అతని స్నేహితుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు.
Recommended Video
మూడేళ్ల క్రితం ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో యువతీ, యువకులు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మతాలు వేర్వేరు కావడంతో కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరికీ పెళ్లి చేస్తానని ప్రియుడు లక్ష్మీపతితో పాటు ఆయన అన్న నటరాజ్ను కూడా పిలిపించారు. వీరిని స్ధానికంగా ఉన్న ఓ ప్రార్ధనా మందిరానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మద్యం పోశారు. మద్యం మత్తులోనే వీరిని తిట్టడం మొదలుపెట్టారు. ఎదురు తిరగ్గానే తమ వద్దనున్న బెల్టుతో గొంతు నులిమి చంపేశారు. ఈ విషయం బయటపెడితే అన్న నటరాజ్ కుటుంబాన్ని కూడా చంపేస్తామని బెదిరించారు. చివరికి నటరాజ్ ఎలాగోలా బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటికొచ్చింది.