మరో ఘోరం: మాండ్యా ఆలయంలో ముగ్గురు అర్చకుల దారుణ హత్య, హుండీల దోపిడీ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాండ్యా నగర శివారు గుట్టల్లోని శ్రీ అరకేశ్వర ఆలయంలోని ముగ్గురు అర్చకులు దారుణంగా హత్య చేయబడ్డారు. వారిని దుండుగులు బండరాళ్లతో కొట్టిచంపారు. ఆలయ ద్వారాలు తెరిచిన గ్రామస్తులు ఈ దారుణం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతులను గణేష్, ప్రకాశ్, ఆనంద్లుగా గుర్తించారు. ఆలయ కాపాలాగ ఉండే ఈ ముగ్గురు అర్చకులను దారుణంగా హతమార్చిన దుండగులు.. ఆలయంలోని హుండీలను దోచుకున్నారు. హుండీలను పగలగొట్టి.. నాణేలను వదిలేసి, కరెన్సీ నోట్లను మాత్రమే దోచుకెళ్లారు.
ముజ్రాయి శాఖ కింద బీ గ్రూప్ టెంపుల్గా ఈ ఆలయం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఐజీపీ విపుల్ కుమార్ మైసూరు నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురు కంటే ఎక్కువ మందే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. దోపిడీ దొంగలే ఈ దారుణాలకు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. మూడు హుండీలను పగలగొట్టి డబ్బులను ఎత్తుకెళ్లారని గుర్తించారు. నగదు, బంగారం కోసం ఆలయ గర్భగుడిలో దొంగలు బీభత్సం సృష్టించారని పోలీసులు తెలిపారు.
ಮಂಡ್ಯದ ಅರಕೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದ ಪೂಜಾರಿಗಳಾಗಿದ್ದ ಶ್ರೀ ಗಣೇಶ್, ಶ್ರೀ ಪ್ರಕಾಶ್ ಮತ್ತು ಶ್ರೀ ಆನಂದ್ ಅವರನ್ನು ದುಷ್ಕರ್ಮಿಗಳು ಹತ್ಯೆ ಮಾಡಿ ದೇವಸ್ಥಾನದ ಹುಂಡಿಯನ್ನು ಕಳ್ಳತನ ಮಾಡಿರುವ ವಿಷಯ ತಿಳಿದು ಅತ್ಯಂತ ನೋವಾಗಿದೆ. (1/2)
— CM of Karnataka (@CMofKarnataka) September 11, 2020
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్నిఫ్ఫర్ డాగ్స్, ఫోరెన్సిక్ నిపుణులతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మాండ్యా ఎస్పీ పరశురాం తెలిపారు. కాగా, ఘటనపై ఈ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.