కర్ణాటకలో కొత్తరకం వైరస్ విజృంభణ: హైఅలర్ట్: 2500 మందికి పరీక్షలు
బెంగళూరు: ప్రాణాలను బలి తీసుకుంటోన్న అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్తో ఒకవంక ప్రజలు పోరాటం సాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మరో మహమ్మారి క్రమంగ విజృంభిస్తోంది. కరోనా వైరస్ను అంతమొందించడానికి వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోన్న సమయంలోనే ఈ వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. మన పొరుగురాష్ట్రం కర్ణాటకలో ఆందోళనకర పరిస్థితులకు కారణమైంది. అదే- క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD). వాడుక భాషలో దీన్ని మంకీ ఫీవర్ (Monkey fever)గా పిలుస్తారు. ఇప్పటిదాకా నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో రెండు శివమొగ్గలో గుర్తించినట్లు వైరాలజీ అధికారులు వెల్లడించారు.
కోతుల నుంచి వ్యాప్తి..
క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్.. కోతుల నుంచి మనుషులకు సోకుతుంది. మొదట్లో కేరళలో ఇది వెలుగులోకి వచ్చింది. కర్ణాటక-కేరళ సరిహద్దులకు ఆనుకుని ఉండే వాయనాడ్ జిల్లాలో తొలిసారిగా దీన్ని గుర్తించారు. మరణించిన కోతులు, అడవుల్లో కీటకాల కుట్టడం వల్ల ఇది వ్యాప్తి చెందుతున్నట్లు నిర్దారించారు. కర్ణాటకలో ఈ మంకీ ఫీవర్ వెలుగులోకి రావడం ఇది మూడోసారి. ఇదివరకు 2019, 2020ల్లో ఇది తన ప్రతాపాన్ని ప్రదర్శించింది. అప్పట్లో 12 జిల్లాల్లో ఇది కనిపించింది. దీని బారిన పడి పలువురు మరణించారు. తాజాగా మళ్లీ తన ఉనికిని చాటుకుంది.
2500 మందికి పరీక్షలు..
మంకీ ఫీవర్ విజృంభిస్తోన్నట్లు గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటిదాకా 2500 మందికి పైగా పరీక్షలను నిర్వహించారు. వారిలో నలుగురికి మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించాయి. ఈ నాలుగింట్లో శివమొగ్గ జిల్లాలో రెండు.. మల్నాడ్ రీజియన్లో మరో రెండు నమోదయ్యాయి. శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలూకా రంగనాథపుర గ్రామానికి చెందిన 36 సంవత్సరాల వ్యక్తికి మంకీ ఫీవర్ సోకింది. ఈ మధ్యకాలంలో అతను ఎప్పుడూ అడవుల్లోకి వెళ్లిన దాఖలాలు లేవని కర్ణాటక వైరల్ డయాగ్నస్టిక్స్ ల్యాబొరేటరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ కిరణ్ కేఎస్ తెలిపారు. శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి తాలూకాలో మరో కేసును గుర్తించామని అన్నారు.
చిక్మగళూరులో మరో కేసు..
చిక్మగళూరు జిల్లా ఎన్ఆర్ పుర తాలూకాలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. బాధితునికి కరోనా పాజిటివ్ రావటంతో మరిన్ని పరీక్షలు నిర్వహించగా.. మంకీ ఫీవర్గా తేలింది. తీర్థహళ్లి తాలూకాలో నివసించే తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి వెళ్లొచ్చిన అనంతరం అతనికి కేఎఫ్డీ సోకినట్లు నిర్ధారించారు. అతణ్ని ఉడుపి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పితో అతను బాధపడుతున్నట్లు గుర్తించారు.
వ్యాధి లక్షణాలివే..
జలుబు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, రక్తస్రావం, రక్తపోటు తగ్గడం, ప్లేట్ లెట్ తగ్గిపోవడం, ఎర్ర రక్తకణాలు మందగించడం వంటివి మంకీ ఫీవర్ లక్షణాలుగా గుర్తించారు. దీని బారిన పడిన తరువాత వారం లేదా రెండు వారాల్లో రోగులు సాధారణ వైద్యం ద్వారా కోలుకుంటారు. అప్పటికీ తగ్గకపోతే వ్యాధి ముదిరినట్లుగా భావిస్తారు. ముదిరిన తరువాత తీవ్రమైన తలనొప్పి, మానసిక రుగ్మతలు,కంటి చూపు మందగించడం, వణుకు పుట్టడం వంటివి తలెత్తుతాయి. తాజాగా ఈ వ్యాధి మరింత విస్తరిస్తుండటంతో శివమొగ్గ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. పరీక్షలను కొనసాగిస్తామని కిరణ్ కేఎస్ తెలిపారు.