బస్సులో చెలరేగిన మంటలు: అగ్నికీలలకు అయిదుమంది సజీవ దహనం: నిద్రలోనే
చిత్రదుర్గ: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో అయిదుమంది సజీవ దహనం అయ్యారు. పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఓ చిన్నారి ఉన్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు.
ముగ్గురి మరణానికి దారి తీసిన బెంగళూరు అల్లర్లు: నిందితుడి అరెస్ట్: ఫేస్బుక్ పోస్ట్: ఎవరంటే?
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రముఖ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు మంగళవారం రాత్రి విజయపుర నుంచి 32 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరింది. మార్గమధ్యలో బస్సు చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలూకా పరిధిలో నాలుగో నంబర్ జాతీయ రహదారిపై ఉన్న కేఆర్ హళ్లి మీదుగా ప్రయాణిస్తోన్న సమయంలో ఉన్నట్టుండి ఇంజిన్లో పొగలు చెలరేగాయి.
దీన్ని గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులను మేల్కొలిపారు. ప్రయాణికులు కిందికి దిగుతున్న సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. లోపల ఉన్నవారు వెంటనే బయటపడలేకపోయారు. దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో అగ్నికీలలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా అయిదుమంది సజీవ దహనం అయ్యారు. బస్సు పూర్తిగా కాలిపోయింది.
Recommended Video
ప్రయాణికులు హిరియూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బస్సు మొత్తం దగ్ధమైంది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. హిరియూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్సీ రాధికా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు.