ఘోర ప్రమాదం: నడిసముద్రంలో బోల్తా కొట్టిన మర పడవ: మత్స్యకారులు గల్లంతు: ముమ్మరంగా గాలింపు
మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు తీరంలో ఘోర ప్రమాదం సంభవించింది. చేపట వేటకు వినియోగించే ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. నడి సముద్రంలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పలువురు జాలర్లు గల్లంతయ్యారు. మరికొందరిని తీర ప్రాంత రక్షక బలగాలు రక్షించాయి. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. ఫిషింగ్ బోటు బోల్తా కొట్టడానికి భారీ అలలు, బలమైన ఈదురు గాలులు కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలాన్ని రేపింది.
బిగ్బాస్ కంటెస్టెంట్ నా పెళ్లాం: మోసగించింది: మరొకరితో ఎఫైర్: టాప్ బిజినెస్మెన్ సంచలనం
మంగళూరు తీరం సమీపంలోని హణంబూరు ప్రాంతం నుంచి శ్రీరక్షా అనే మరపడవలో 22 మత్స్యకారులు చేపలవేటకు బయలుదేరారు. కొన్ని నాటికన్ మైళ్ల దూరం వెళ్లిన తరువాత.. ఆ పడవ ప్రమాదానికి గురైంది. బోల్తా కొట్టింది. సామర్థ్యానికి మించి మత్స్యకారులు అందులో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే తీర ప్రాంత రక్షక బలగాలు రంగంలో దిగాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టాయి.
16 మందిని ప్రాణాలతో కాపాడగలిగారు. మరో ఆరుమంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. పడవ ప్రమాదానికి గురైన సమయంలో భారీగా ఈదురుగాలులు వీచాయని, కెరటాలు ఎగిసిపడ్డాయని ప్రాణాలతో బయటపడిన మత్స్యకారులు తెలిపారు. నీరు కడుపులోకి వెళ్లడం వల్ల వాంతులు చేసుకుంటూ అనారోగ్యానికి గురైన కొందరు మత్స్యకారులను ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Recommended Video
గల్లంతైన ఆరు మంది మత్స్యకారులను కాపాడటానికిక శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అవసరమైతే హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపడతామని వెల్లడించారు. తుఫాన్ తరహా పరిస్థితులు ఏర్పడినందున.. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. మంగళూరు తీరానికి తుఫాన్ ప్రభావం లేకపోవడం వల్లే మత్స్యకారులు చేపలవేటకు బయలుదేరి ఉంటారని భావిస్తున్నట్లు స్థానిక అధికారులు చెప్పారు. తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాలు, కేరళకు తుఫాన్ ప్రభావం ఉందని, కర్ణాటక దాని తీవ్రత ఉండదని భావించినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.