ఐఎఎస్తో ఈక్వల్: ఆ ఆధికారిణి ఇంటిపై ఏసీబీ రెయిడ్స్: కళ్లు చెదిరే ఆస్తులు: అక్రమార్జన ఎలా?
బెంగళూరు: కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (కేఎఎస్) అధికారిణి డాక్టర్ బీ సుధ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఆదాయానికి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ)లో స్పెషల్ ల్యాండ్ అక్విజిషన్ అధికారిణిగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
ప్రస్తుతం ఆమె కర్ణాటక ఇన్ఫర్మేషన్ అండ్ బయో టెక్నాలజీ శాఖలో పని చేస్తున్నారు. బెంగళూరులో ఆమెకు చెందిన అయిదు నివాసాలపై ఏకకాలంలో దాడులు చేపట్టారు. శనివారం ఉదయం నుంచీ అవి కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో బంగారం, 10 లక్షల రూపాయల నగదు, ఖరీదైన ఎస్యూవీ కారును స్వాధీనం చేసుకున్నారు. కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేశారు. డాక్టర్ సుధ లంచం రూపంలో బంగారం, వాహనాలను తీసుకున్నట్లు తేలింది. లెక్క తేలని కోటి రూపాయల నగదు, అయిదు విలాసవంతమైన బంగళాలు, పెద్ద మొత్తంలో బంగారాన్ని గుర్తించామని, ఆమె ఆదాయానికి మించినవేనని నిర్ధారించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
బెంగళూరులోని కోడిహళ్లి, యలహంకలోని శివనహళ్లి మెయిన్ రోడ్, బ్యాటరాయనపుర, మైసూరులోని శ్రీరామ్పురా, ఉడుపిలోని హెబ్రి ప్రాంతంలో ఆమెకు బంగళాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2015లోనూ ఆమె నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు జరిపినట్లు చెబుతున్నారు. బెంగళూరు నగర శివార్లలో లే అవుట్లు వెలుస్తోన్న సమయంలో ఆమె బీడీఏలో ల్యాండ్ అక్విజిషన్ అధికారిణిగా పనిచేశారని, ఆ సమయంలో వ్యవసాయ భూములను రెసిడెన్షియల్గా మార్చడానికి పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించినట్లు తమ విచారణలో తేలిందని, ఆమెపై కేసు నమోదు చేశామని అన్నారు.