కరోనా విలయం: కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణరావు మృతి - కర్ణాటకలో వరుస విషాదాలు
కరోనా మహమ్మారి విలయతాండవానికి బలైపోతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి సురేశ్ అంగడి కరోనాతో చనిపోయి 24 గంటలైనా గడవకముందే.. అదే రాష్ట్రానికి చెందిన మరో ఎమ్మెల్యే మృత్యువాతపడ్డారు.
బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న బి.నారాయణరావు(65) బుధవారం కన్నుమూశారు. పాజిటివ్ గా తేలడంతో సెప్టెంబర్ 1న బెంగళూరులోని మణిపూర్ ఆస్పత్రిలో చేరగా.. రెండ్రోజుల కిందట ఆరోగ్యం మరింత విషమించింది. చివరికి ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
కొవిడ్ కారణంగా ఎమ్మెల్యే శరీర భాగాలు బాగా దెబ్బతిన్నాయని, వెంటిలేటర్ ద్వారా లైఫ్ సపోర్టు అందించినా ఫలితం లేకపోయిందని మణిపూర్ ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. నారాయణరావు మరణవార్త తెలిసిన వెంటనే.. కర్ణాటక అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేసి, నేతలందరూ ఆస్పత్రికి తరలివెళ్లారు.
Recommended Video
నారాయణరావు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, తన జీవితకాలమంతా ఆయన పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ఎమ్మెల్యే మృతిపై సీఎం యడ్యూరప్ప సహా పార్టీలకు అతీతంగా నేతలు నివాళులు అర్పించారు. రెండు రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు చనిపోవడం అందరిలో విషాదాన్ని నింపింది.