కర్ణాటక కాంగ్రెస్ చీఫ్కు సోకిన కరోనా: ఆసుపత్రిలో ట్రబుల్ షూటర్: పీసీసీ నేతల్లో కలవరం
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ఉద్యాన నగరి బెంగళూరులో ఇప్పటికే లక్ష మార్క్ను దాటిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింత బలపడుతున్నాయి. రోజురోజుకూ కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. సోమవారం అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలో 1,09,793 కరోనా కేసులు ఉన్నాయి. ఇందులో 73,363 మంది డిశ్చార్జి అయ్యారు. 1695 మంది కరోనా వల్ల మరణించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కిందటి నెల వారం రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ను ప్రకటించారు. అయినా అదుపులోకి రాలేదు.
బీబీఎంపీ పరిధిలో కరోనా వైరస్ ఏ మాత్రం అదుపులోకి రావట్లేదనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అత్యవసర చికిత్సను పొందుతున్నారు. కొద్దిరోజులుగా తనను కలిసిన నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు.. వెంటనే కరోనా వైరస్ పరీక్షలను చేయించుకోవాలని డీకే శివకుమార్ సూచించారు. తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన పడొద్దని చెప్పారు.
కొద్దిరోజులుగా డీకే శివకుమార్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి- బెంగళూరులోని పులకేశి నగర కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి నివాసంపై అల్లరిమూకలు దాడి చేయడం, ఇంటిని తగులబెట్టిన ఘటనల అనంతరం డీకే శివకుమార్ పార్టీ నేతలు, కార్యకర్తలో విస్తృత సమావేశాలను నిర్వహించారు. వరదల్లో నష్టపోయిన ప్రాంతాల్లోనూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా వైరస్ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
కొద్దిరోజుల కిందటే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కరోనా పాజిటివ్గా తేలారు. యడియూరప్ప కేబినెట్లోని కొందరు మంత్రులకూ కరోనా వైరస్ సోకింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీరాములు, పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి కరోనా ప్రభావానికి లోనైన వారే. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న యడియూరప్ప తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
Recommended Video
కర్ణాటక వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండున్నర లక్షలను దాటుకుంది. 2 లక్షల 84 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో రికవరీ అయిన వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటోంది. లక్షా 98 వేల మంది వరకు కరోనా బారి నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. 4810 మంది ఇప్పటిదాకా మరణించారు. యాక్టివ్ కేసులు వేలల్లో ఉంటున్నాయి. కర్ణాటక మొత్తానికీ బెంగళూరులోనే అత్యధిక కేసులు రికార్డు అయ్యాయి. లక్షకు పైగా నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది.