Covaxin రెండో డోసుకు 6 వారాలే గ్యాప్: రూ.843 కోట్లతో గ్లోబల్ టెండర్లు: వారికి ప్రయారిటీ
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ప్రక్రియను చేపట్టింది. గ్లోబల్ టెండర్లను పిలవడం ద్వారా రెండు కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ను సేకరించబోతోంది. దీనికోసం 843 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. అన్ని రాష్ట్రాల్లాగే- కర్ణాటక కూడా కరోనా వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో మహారాష్ట్ర తరువాత అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతోన్నది ఈ రాష్ట్రంలోనే. యాక్టివ్ కేసుల్లో కర్ణాటక.. దేశంలోనే మొదటి స్థానంలో ఉంటోంది.
డిమాండ్కు అనుగుణంగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేకపోవడం వల్ల గ్లోబల్ టెండర్ల ద్వారా వాటిని సేకరించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రయను వేగవంతం చేసింది. వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వర్థ నారాయణ సారథ్యంలో ఏర్పాటైన కోవిడ్ టాస్క్ఫోర్స్.. గ్లోబల్ టెండర్ల ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. నాలుగు విడతల్లో రెండు కోట్ల డోసుల వ్యాక్సిన్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఒక్కో విడతకు 50 లక్షల డోసుల చొప్పున వ్యాక్సిన్లను సమీకరిస్తామని టాస్క్ఫోర్స్ పేర్కొంది. ఇదే గ్లోబల్ టెండర్ల ద్వారా 75 కోట్ల రూపాయలతో అయిదు లక్షల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను కడా సేకరించనున్నట్లు వెల్లడించింది.
రెండో విడత వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోన్న వారు.. తప్పనిసరిగా 12 వారాల పాటు వేచి ఉండక తప్పదని అశ్వర్థ నారాయణ తెలిపారు. కోవాగ్జిన్ టీకా వేసుకున్న వారికి ఆరు వారాలు, కోవిషీల్డ్ తీసుకున్న వారికి 12 వారాలు వ్యవధి విధించినట్లు పేర్కొన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల్లోపు ఉన్న వారికి వ్యాక్సిన్ అందజేయడంలో ప్రాధాన్యతా క్రమాన్ని రూపొందించుకున్నామని అన్నారు. పోస్టల్, వ్యవసాయ శాఖల్లో పనిచేసే వారు, బ్యాంకు ఉద్యోగులు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, వీధి వ్యాపారులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వారికి అత్యవసరంగా వ్యాక్సిన్లను అందజేయాల్సి అవసరం ఉన్నట్లు టాస్క్ఫోర్స్ గుర్తించిందని చెప్పారు.
Recommended Video
ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం.. కర్ణాటకలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 41,664 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 349 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 21,71,931కి చేరాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఆరు లక్షల మార్క్ను దాటాయి. 6,05,494కు చేరుకున్నాయి. జూన్ 10వ తేదీ నాటికి ఈ సంఖ్య 10 లక్షల మార్క్ను దాటొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.