Delta plus variant: మన పక్క రాష్ట్రానికీ పాకింది: బీ అలర్ట్: చాప కింద నీరులా
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసకర పరిస్థితులు దేశంలో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్నాయి. దీని బారిన పడిన అన్ని రాష్ట్రాలు క్రమంగా కోలుకుంటోన్నాయి. లాక్డౌన్ నుంచి బయటపడుతోన్నాయి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందంటూ ఊపిరి పీల్చుకునే లోపే- దాని కొత్త రూపం విరుచుకు పడింది. డెల్టా ప్లస్ వేరియంట్ (Delta plus variant) ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా కంటే శక్తిమంతమైన వైరస్ మ్యూటెంట్గా దీన్ని భావిస్తోన్నారు. దేశంలో థర్డ్వేవ్ ఏర్పడటానికి ఈ మ్యూటెంట్ ప్రధాన కారణమౌతుందనే అనుమానాలను మరింత బలాన్ని కలిగించేలా చాపకింద నీరులా విస్తరిస్తోంది.
ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్లల్లో వెలుగులోకి వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్.. తాజాగా కర్ణాటకలోనూ అడుగు పెట్టింది. ఉద్యాననగరి బెంగళూరు, రాజనగరి మైసూరుల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. ఈ రెండు నగరాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం సైతం అందిందని ఆయన చెప్పారు.
మైసూరులో ఒకరు ఈ వేరియంట్ బారిన పడ్డారని అన్నారు. ఆ పేషెంట్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని చెప్పారు. అసింప్టోమేటిక్గా అతణ్ని గుర్తించినట్లు సుధాకర్ పేర్కొన్నారు. ప్రైమరీ, సెకెండరీ కాంటాక్ట్స్ ఎక్కడా లేవని అన్నారు. అయినప్పటికీ- తాము అప్రమత్తంగా ఉన్నామని, ఆ పేషెంట్ కాంటాక్ట్స్లను ట్రేస్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ వేరియంట్పై అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని, ముందుజాగ్రత్త చర్యగా ఆరు జీనోమ్ ల్యాబొరేటరీలను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు.
డెల్టా ప్లస్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్స్లను పరిశీలించడానికి మైసూరు జిల్లా నుంచి మొత్తం 40 శాంపిళ్లు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్)కు పంపించినట్లు చెప్పారు. కర్ణాటక కోవిడ్ విభాగం నోడల్ అధికారి డాక్టర్ వీ రవి తెలిపారు. మైసూరులో డెల్టా ప్లస్ వేరియంట్ బారిన పడిన వ్యక్తి ఇప్పటిదాకా వ్యాక్సిన్ వేసుకోలేదని వివరించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, పేర్కొన్నారు. అతనికి ఈ వైరస్ ఎలా సోకిందనే విషయంపై ఆరా తీస్తోన్నామని డాక్టర్ రవి చెప్పారు. మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ ట్రీట్మెంట్కు ఇది లొంగదని వివరించారు.