ఒమిక్రాన్ వేరియంట్ సూపర్ స్ప్రెడర్గా బెంగళూరు డాక్టర్స్ కాన్ఫరెన్స్?: ఓ డాక్టర్ పాజిటివ్
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. క్రమంగా అది విస్తరిస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని ఎప్పుడో దాటేసింది. ఇప్పటిదాకా 24 దేశాల్లో అడుగు పెట్టింది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఆయా దేశాలన్నింట్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు. బెంగళూరులో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ విస్తరించిన దేశాలివే..
దక్షిణాఫ్రికా, బోట్సువానాల్లో వెలుగులోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే ఒమిక్రాన్ వేరియంట్ ఇతర ఖండాలకు విస్తరించింది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, బెల్జియం, బోట్సువానా, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ కేసులు నమోదయ్యాయి. ఇదే జాబితాలో భారత్ చేరింది. ఆయా దేశాలతో పోల్చుకుంటే.. భారత్లో నమోదైన కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. పెరిగే ప్రమాదం లేకపోలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
సూపర్ స్ప్రెడర్గా
కిందటి నెల బెంగళూరులో నిర్వహించిన ఓ అంతర్జాతీయ స్థాయి డాక్టర్ల కాన్ఫరెన్స్.. ఒమిక్రాన్ వేరియంట్కు సూపర్ స్ప్రెడర్గా మారుతుందనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఓ డాక్టర్.. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారు. బెంగళూరులో 46 సంవత్సరాల వయస్సు ఉన్న డాక్టర్ ఒకరు ఒమిక్రాన్ పాజిటివ్గా తేలారు. ఆయనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఏ దేశ పర్యటనకూ ఆయన వెళ్లలేదు. ఈ డాక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు.
నవంబర్లో మూడు రోజుల పాటు..
నవంబర్లో 19,20,21 తేదీల్లో బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో ఈ అంతర్జాతీయ డాక్టర్ల కాన్ఫరెన్స్ ఏర్పాటైంది. ఇండియన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ దీన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులో ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డ డాక్టర్ ఈ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఆ మరుసటి రోజు నుంచే ఆయనలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. సాధారణంగా- వైరస్ లక్షణాలు బయటపడటానికి అయిదు నుంచి 10 రోజులు పడుతుందని, ఇందులో పాల్గొనడానికి ముందే ఆయన వైరస్కు గురై ఉండొచ్చని ఇండియన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అభిప్రాయపడింది.
Recommended Video
ముగ్గురికి వైరస్
ఇదే కాన్ఫరెన్స్లో పాల్గొన్న మరో ముగ్గురు డాక్టర్లకు కూడా కరోనా వైరస్ సోకింది. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించగా.. అది డెల్టా వేరియంట్గా తేలిందని కాన్ఫరెన్స్ నిర్వాహకులు తెలిపారు. మరొకరికి చెందిన శాంపిళ్ల రిపోర్టులు ఇంకా అందాల్సి ఉందని పేర్కొన్నారు. ఇదే కాన్ఫరెన్స్కు 163 మంది ఆపరేషన్ థియేటర్ స్టాఫ్ హాజరయ్యారు.
అనంతరం వారందరూ విధులకు హాజరయ్యారు. వారి ద్వారా పేషెంట్లకు వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వారు పనిచేస్తోన్న ఆసుపత్రుల చికిత్స పొందుతోన్న కొందరు పేషెంట్లు, తోటి ఉద్యోగులకు నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్గా తేలినట్లు కాన్ఫరెన్స్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బీసీ శ్రీనివాస్ చెప్పారు.