దివంగత ఐఎఎస్ అధికారి భార్య పొలిటికల్ ఎంట్రీ: ఉప ఎన్నికల్లో పోటీకి సై: గెలుపుపై ధీమా
బెంగళూరు: కర్ణాటకలో సంచలనం రేపిన ఐఎఎస్ అధికారి ఆత్మహత్య ఉదంతం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆ ఐఎఎస్ అధికారి భార్య రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టికెట్ ఇస్తామనే హామీ లభించడం వల్లే కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారని చెబుతున్నారు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు అంటున్నారు.
ఆ ఐఎఎస్ అధికారి డీకే రవి. 2015లో బెంగళూరు కోరమంగల ప్రాంతంలోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సీబీఐ అధికారులు నిర్ధారించారు. దానికి గల కారణాలు ఏమిటనేది ఇప్పటికీ తెలియరాలేదు. వ్యక్తిగత కారణాల వల్లే డీకే రవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. డీకే రవి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగించాలా, వద్దా అనే విషయంపై ఏ నిర్ణయాన్నీ తీసుకోలేదు.
తాజాగా-డీకే రవి భార్య హెచ్ కుసుమ.. రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం ఆమె బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువాను కప్పుకొన్నారు. వచ్చే నెల 3వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం ఖాయంగా మారింది. రాజరాజేశ్వరి నగర నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల బరిలో దిగబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనధికారికంగా వెల్లడిస్తున్నారు.
Recommended Video
కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) ఉమ్మడి అభ్యర్థిగా హెచ్ కుసుమ పోటీలో ఉండే అవకాశాలు లేకపోలేదు. ఈ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న ఈ స్థానం నుంచి విజయం సాధించారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ఆపరేషన్ ఆకర్ష అనంతరం ఆయన భారతీయ జనతాపార్టీలో చేరారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజరాజేశ్వరి నగరతో పాటు శిరా నియోజకవర్గానికి వచ్చేనెల 3వ తేదీన ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు.