మంత్రి బళ్లారి శ్రీరాములు ఇంట్లో విషాదం - కరోనా నుంచి కోలుకున్న కొద్ది గంటకే తల్లి మృతి..
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి, తెలుగువారికి ఎంతో సుపరిచితుడైన బళ్లారి శ్రీరాములు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అనూహ్య పరిస్థితుల నడుమ శ్రీరాములు తల్లి హొనూరమ్మ(95) కన్నుమూశారు. కొవిడ్ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి తిరిగొచ్చిన గంటల వవధిలోనే ఆమె ప్రాణాలు విడిచారు. తల్లి మరణవార్తను మంత్రి శ్రీరాములు స్వయంగా ట్విటర్ లో తెలిపారు.
కరోనా వేళ షాకింగ్ బిజినెస్ - వాడి పారేసిన గ్లవ్స్ మళ్లీ అమ్మకం - ఎలా డిస్పోజ్ చేయాలో తెలుసా?
ప్రభుత్వాసుపత్రిలో చికిత్స..
ఆరోగ్య మంత్రిగా విస్తృత పర్యటనలు చేసిన శ్రీరాములు రెండు వారాల కిందట ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. ఆయన తల్లి హోనూరమ్మకు కూడా వైరస్ సోకింది. కర్ణాటకలో కొవిడ్ వ్యాధికి గురైన ఇతర మంత్రులు, రాజకీయ నేతలంతా కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందగా, శ్రీరాములు మాత్రం తల్లితో కలిసి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరడం గమనార్హం. బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రిలో తల్లీకొడుకులు చికిత్స పొందారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెంచడానికే తానీ పని చేశానని ఆ సందర్భంలో శ్రీరాములు చెప్పారు.
నాలుగు రోజుల వ్యవధిలో..
బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రి నుంచి ఈనెల 16న మంత్రి శ్రీరాములు డిశ్చార్జ్ అయ్యారు. పెద్ద వయసు అయినప్పటికీ హోనూరమ్మ కూడా చికిత్సకు బాగా స్పందించి, కోలుకోగలిగారు. దీంతో కొడుకు డిశ్చార్జ్ అయిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఆమెను కూడా డాక్టర్లు ఇంటికి పంపేశారు. బెంగళూరు నుంచి నేరుగా సొంతూరు బళ్లారికి వెళ్లిపోయిన ఆమెకు గురువారం రాత్రి ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి, ప్రాణాలు విడిచారు.
శ్రీరాములుకు నేతల సానుభూతి..
‘‘మా అమ్మ హోనురామ్మ వృద్ధాప్య సమస్యల కారణంగా గురువారం రాత్రి చనిపోయారని చెప్పడానికి చింతిస్తున్నాను. ఆమె వయసు 95 ఏళ్లు. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని, బెంగళూరు బౌరింగ్ ఆస్పత్రి నుంచి నిన్ననే ఇంటికి తిరొచ్చారు''అని మంత్రి శ్రీరాములు ట్విటర్ లో వెల్లడించిన తర్వాత పార్టీలకు అతీతంగా నేతలు, కన్నడ ప్రముఖులు మంత్రికి సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప.. శ్రీరాములు తల్లి మృతి పట్ల సతాపం తెలిపారు. వైద్య విద్యా శాఖ మంత్రి సుధాకర్ సహా పలువురు మంత్రులు విచారం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో కరోనా సీన్ ఇది..
దేశంలోకి వైరస్ ప్రవేశించిన తొలి మూడు నెలలూ సేఫ్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న కర్ణాటకలో గత రెండు నెలలుగా భారీ ఎత్తున కేసులు, మరణాలు నమోదువున్నాయి. శ్రీరాములు నేతృత్వంలోని వైద్య శాఖ గురువారం వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.57లక్షలకు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 4,429కి చేరింది. ఇప్పటి వరకు 1,70,381 మంది కోలుకోగా ప్రస్తుతం 82,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది.