కర్ణాటకలో మోగిన స్థానిక ఎన్నికల నగారా: బ్యాలెట్ ఫైట్: ఇదీ షెడ్యూల్: ఫలితాలు ఎప్పుడంటే?
బెంగళూరు: కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం కొద్దిసేపటి కిందట విడుదల చేసింది. రెండు దశల్లో పోలింగ్ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణాదిన అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో స్థానిక ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
22, 27 తేదీల్లో పోలింగ్..
ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సారథ్యంలోని అధికార భారతీయ జనతా పార్టీ ఒంటిరిగా పోటీ చేయబోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడానికి అధికారులు సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 22, 27 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. 30వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.
రెండు విడతల్లో 5,762 గ్రామాలకు..
ఆ రెండు రోజులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 5,762 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తారు. తొలి విడత అంటే.. 22వ తేదీన 113 తాలూకాల పరిధిలోకి వచ్చే 2,930 గ్రామ పంచాయతీలకు ఓటింగ్ ప్రక్రియను చేపడతారు. మరో 113 తాలూకాల్లోని 2,832 గ్రామాలకు 27వ తేదీన పోలింగ్ను నిర్వహిస్తారు. బీదర్ జిల్లాలో మాత్రం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించనున్నారు.
మూడు కోట్ల వరకు ఓటర్లు..
కర్ణాటకలో మొత్తం 6,006 గ్రామ పంచాయతీలు ఉండగా.. 5,762లల్లో ప్రజా ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 92,121 స్థానాలు భర్తీ అవుతాయి. మొత్తం 2,96,15,048 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారి కోసం 45,125 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేశామని అన్నారు. అలాగే- ప్రతి పోలింగ్ కేంద్రం వద్దా శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
ఇదీ షెడ్యూల్
తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం డిసెంబర్ 7వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది. 11వ తేదీ వరకు నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. 14వ తేదీన నామినేషన్ పత్రాల ఉపసంహరణకు తుది గడువు. రెండో విడత కోసం 11వ తేదీన నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేస్తారు. 16వ తేదీ వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 19. బీదర్ జిల్లాలో మాత్రమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తారు. మిగిలిన జిల్లాల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా ఓటింగ్ కొనసాగుతుంది.