తల్లీ కుమారుడి హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్: లవ్ ఎఫైర్: కొత్త ప్రేమికుడితో పాత ప్రియుడు మర్డర్
బెంగళూరు: సంచలనం సృష్టించిన జంటహత్యల కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసును తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో కొత్త నిందితుల పేర్లు బహిర్గతమౌతున్నాయి. ఈ కేసులో తాజాగా మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. ఓ యువతి, ఆమె ప్రియుడి హస్తం ఉన్నట్లు తేలింది. వారిద్దరినీ ఈ హత్యకేసులో ప్రధాన నిందితులుగా గుర్తించారు పోలీసులు. హత్యారోపణను ఎదుర్కొంటోన్న యువకుడు తప్పించుకుని పారిపోతుండగా.. పోలీసులు కాల్పులు జరిపారు. గాయాలపాలైన అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
డబుల్ మర్డర్తో కలకలం..
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ నెల 11వ తేదీన ఈ హత్యోదంతం చోటు చేసుకుంది. జిల్లాలోని సాగర తాలూకా కేలడి సమీపంలోని హళే ఇక్కేరి గ్రామానికి చెందిన బంగారమ్మ, ఆమె కుమారుడు ప్రవీణ్ దారుణ హత్యకు గురయ్యారు. ప్రవీణ్కు భార్య రోహిణి, 10 నెలల కుమార్తె ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వారి ఇంటిపై దాడి చేసి, బంగారమ్మ, ప్రవీణ్ను కత్తులతో పొడిచి హత్య చేశారు. ప్రవీణ్ స్థానికంగా మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఈ ఘటన జిల్లాలో కలకలాన్ని రేపింది. సాగర మాజీ ఎమ్మెల్యే గోపాలకృష్ణ బేలూరు, జిల్లా ఎస్పీ కేఎం శాంతరాజు స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
పెళ్లికి ముందే యువతితో పరిచయం..
ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ ఆర్థికంగా భవన నిర్మాణ రంగంలో మేస్త్రీగా పనిచేస్తుండటం, హత్యానంతరం ఇంట్లో చోరీకి పాల్పడకపోవడంతో ఈ డబుల్ మర్డర్ కేసులో ఆర్థిక కారణాలు లేవని పోలీసులు ధృవీకరించుకున్నారు. ప్రవీణ్ భార్య రోహిణికి హాని కలిగించకపోవడాన్ని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. హత్యానంతరం ఆమె ప్రవర్తనపై నిఘా ఉంచారు. ప్రవీణ్ గురించి ఆరా తీయగా.. పెళ్లికి ముందే అతనికి అదే గ్రామానికి చెందిన శృతి అనే యువతితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలింది. రోహిణితో ప్రవీణ్ పెళ్లి అనంతరం శృతి ఉద్యోగం నిమిత్తం బెంగళూరుకు వెళ్లారు.
వీడియోలతో బ్లాక్ మెయిల్..
అక్కడ ఆమెకు భరత్ అనే మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. తన మాజీ ప్రియురాలు మరో యువకుడితో సన్నహితంగా ఉంటోందనే విషయం ప్రవీణ్కు తెలిసింది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియో సైతం ప్రవీణ్ చేతికి చిక్కింది. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని.. ప్రవీణ్ తరచూ ఆమెను బెదిరించే వాడు. శారీరకంగా లొంగదీసుకోవడానికీ వెనుకాడలేదు. దీనితో ప్రవీణ్ అడ్డు తొలగించుకోవాలని శృతి భావించారు. దీనికోసం తన కొత్త ప్రియుడు భరత్ సహకారాన్ని తీసుకున్నారు. ప్రవీణ్ను హత్య చేయడానికి సుపారీ ఇచ్చారు.
పోలీసుల కాల్పుల్లో..
ప్రవీణ్, అతని తల్లి బంగారమ్మను హత్య చేయడంలో శృతి, భరత్ నిందితులుగా నిర్దారించారు. భరత్ను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం అతణ్ని తమ వాహనంలో శివమొగ్గ జిల్లాకు తరలిస్తుండగా.. మార్గమధ్యలో అతను తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. దీనితో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. కాళ్లకు షూట్ చేశారు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ అతని కాలిని నుంచి దూసుకెళ్లింది. గాయపడ్డ అతణ్ని పోలీసులు సాగర తాలూకా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ కేసులో మరికొందర్ని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.