ఉలిక్కిపడ్డ బెంగళూరు: చెవులు చిల్లులు పడేలా భారీ పేలుడు: జనావాసాలు ఖాళీ
బెంగళూరు: ఉద్యాననగరి బెంగళూరు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమెకల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొన్ని మీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగ అలముకుంది. ఈ ఘటనలో ప్రాణాపాయం సంభవించినట్లు ఇప్పటిదాకా సమాచారం రాలేదు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో నలుగురు కార్మికులు ఉండగా.. వారిని సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. భారీగా ఆస్తినష్టం సంభవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
వైఎస్ జగన్ రాజకీయ వ్యూహకర్తకు ఏమైంది?: గుడ్బై చెప్పారా? రిజల్ట్స్ వేళ..
బెంగళూరులో మైసూర్ రోడ్డులోని హోస గుడ్డదహళ్లి సమీపంలో గల బాపూజీ నగర్లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బాపూజీ నగర్లో జనావాసాల మధ్య కొనసాగుతోన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు వ్యాపించడానికి ముందు- పేలుడు శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పేలుడు తరువాతే మంటలు వ్యాపించాయని అంటున్నారు. దుర్వాసనతో కూడిన దట్టమైన నల్లటి పొగ చుట్టేసింది.
ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు జనావాసాలను ఖాళీ చేయిస్తున్నారు. సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నారు. కెమికల్ ఫ్యాక్టరీ కావడం వల్ల విషవాయువులు వెలువడటానికి అవకాశం ఉందంటూ మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ.. పోలీసులు దాన్ని తోసిపుచ్చారు. విష వాయువుల ప్రభావం లేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం ధాటికి కెమికల్ ఫ్యాక్టరీ ధ్వంసమైంది. గోడలు కుప్పకూలిపోయాయి. పార్క్ చేసి ఉంచిన పలు వాహనాలు మంటల బారిన పడ్డాయి. అగ్నికి అహూతి అయ్యాయి.
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విపత్తుల నిర్వహణా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయిదు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. బెంగళూరు వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజీవ్ ఎం పాటిల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో నలుగురు కార్మికులు ఉన్నట్లు తెలియడంతో వారిని రక్షించామని తెలిపారు.