ఒకే కుటుంబంలో నలుగురికి: బెంగళూరులో 144 సెక్షన్: నో మ్యాన్ జోన్ లిస్ట్: ఆ జిల్లా హద్దులు క్లోజ్
బెంగళూరు: ఉద్యాననగరి బెంగళూరులో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏడు కేసులు బెంగళూరు సిటీలో వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్ నుంచి వచ్చిన ఆ ముగ్గురిలోనూ కొత్త కరోనా లక్షణాలు కనిపించాయి. బెంగళూరుకే పరిమితమైందనుకున్న కరోనా కొత్త వైరస్ శివమొగ్గ జిల్లా వరకూ పాకింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కొత్త కరోనా వేరియంట్ సోకింది. వారి సెకెండరీ కాంటాక్టును అధికారులు గుర్తించే పనిలో పడ్డారు.
షాకింగ్: ఫైజర్ వ్యాక్సిన్ పనిచేయట్లేదా?: టీకా వేయించుకున్న నర్సుకు కరోనా పాజిటివ్: అనారోగ్యం
బెంగళూరులో 144 సెక్షన్..
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. కొత్త సంవత్సరాది వేడుకలను రద్దు చేసింది. బెంగళూరులో రాత్రివేళ 144 సెక్షన్ను విధించింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి శుక్రవారం తెల్లవారు జామున 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఈ మేరకు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. బెంగళూరులోని అనేక ప్రాంతాలను నో మ్యాన్ జోన్గా గుర్తించినట్లు వెల్లడించారు.
నో మ్యాన్ జోన్గా గుర్తింపు..
ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి కొత్త సంవత్సరాది వేడుకలను నిర్వహించుకునే ప్రాంతాలైన ఇందిరానగర్, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్, బ్రిగేడ్ రోడ్, కోరమంగల పరిసర ప్రాంతాలను నో మ్యాన్ జోన్గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లోని పబ్స్, రెస్టారెంట్లలో నిర్వహించే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి ముందుగానే బుక్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఇస్తామని కమల్ పంత్ పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శుక్రవారం తెల్లవారు జామున 6 గంటల వరకు బహిరంగ స్థలాలు, రహదారులు, పార్కులు, గ్రౌండ్లల్లో ఎవరూ గుమికూడవద్దని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిషిద్ధం..
బహిరంగ ప్రదేశాల్లో కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. కాగా- కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కన్నడ జిల్లా సరిహద్దులను మూసివేశారు. పర్యాటకులు, సందర్శకుల ప్రవేశాన్ని 48 గంటల పాటు నిషేధించారు. పశ్చిమ కనుమల పరిధిలోని ఎత్తైన పర్వతాల్లో ట్రెక్కింగ్ చేయం, బీచ్లను సందర్శించడానికి ప్రతి సంవత్సం జనవరి 1వ తేదీన పెద్ద ఎత్తున పర్యాటకులు దక్షిణ కన్నడ జిల్లాకు వెళ్తుంటారు.
బీచ్లు క్లోజ్
ఈ సారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పర్యాటక కేంద్రాల్లో సందర్శకులకు అనుమతి ఇవ్వట్లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజేంద్ర కేవీ వెల్లడించారు. దక్షిణ కన్నడ జిల్లా పరిధిలోని ఉల్లాల్, సోమేశ్వర, మొగవీరపట్టణ, పణంబూర్, తన్నీర్బావి, శశిహిత్లు, సూరత్కల్ బీచ్లను మూసివేసినట్లు పేర్కొన్నారు. మత్స్యకారులకు మాత్రమే అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. ఈ నిషేధం రెండు రోజుల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
శివమొగ్గలో శానిటైజేషన్..
ఇదిలావుండగా..- ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ సోకిన నేపథ్యంలో శివమొగ్గలోవారు నివసిస్తోన్న సావర్కర్ నగర్ ప్రాంతంలో కొత్త వ్యక్తులను రానివ్వట్లేదు. ఈ ప్రాంతం మొత్తాన్ని శానిటైజేషన్ చేశారు. 39 మందిని సెకెండరీ కాంటాక్ట్గా గుర్తించారు. వారికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్గా తేలినట్లు జిల్లా వైద్యాధికారి రాజేష్ సురగిహళ్లి తెలిపారు. కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కోవిడ్ ప్రొటోకాల్ను అనుసరిస్తున్నామని చెప్పారు.