డిఫరెంట్ ట్రెండ్: కర్ణాటక ఆలయంలో గంజాయి ప్రసాదం: ప్రాంగణంలోనే దమ్ము కొట్టడానికీ అనుమతి
బెంగళూరు: సాధారణంగా ఆలయాల్లో లడ్డూ, చక్కెర పొంగలి, పులిహోర.. వంటి ఆహార పదార్థాలను ప్రసాదంలా భక్తులకు అందజేస్తుంటారు. అది సంప్రదాయం కూడా. అలాంటిది- గంజాయిని ప్రసాదంలా ఇస్తారని ఎవరూ ఊహించి ఉండరు. నిషేధిత మత్తు పదార్థం గంజాయిని భక్తులకు ప్రసాదంలా పంపిణీ చేస్తారనేది అసలు ఊహకు కూడా అందని విషయం. అదే వాస్తవం. కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని కొన్ని ఒకట్రెండు ఆలయాలు, మఠాల్లో ఈ ట్రెండ్ ఉంది. చాలాకాలంగా ఇది కొనసాగుతోంది. కొన్ని సామాజిక వర్గాల్లో గంజాయిని ప్రసాదంలా స్వీకరించే ఆనవాయితీ ఉండటంతో దాన్ని కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని యాద్గిర్ జిల్లాలో వెలిసిన మౌనీశ్వర ఆలయంలో భక్తులకు చిన్న, చిన్న గంజాయి పాకెట్లను ప్రసాదంలా పంపిణీ చేస్తున్నారు. ఇది అధికారికమే. ఆలయ పాలక మండలి అధికారికంగా గంజాయిని అందిస్తోంది. యాద్గిర్ జిల్లాలోని తింథినిలో ఉందీ ఆలయం. మౌనీశ్వరుడిని ఇక్కడ పూజిస్తారు. పరశురాముడిని మౌనీశ్వరుడిగా, మానప్పగా ఆరాధిస్తారట స్థానికులు. ఈ ఆలయంలో గంజాయిని ప్రసాదంలా అందజేయడం ఆనవాయితీగా వస్తోందని ఓ జాతీయ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఉత్తర కర్ణాటక జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు భక్తులు. కొన్ని సామాజిక వర్గాల్లో గంజాయిని స్వీకరించడం సంప్రదాయబద్ధంగా వస్తోందని, దాన్ని కొనసాగిస్తున్నామని ఆలయ పాలక మండలి సభ్యులు చెబుతున్నారు. శరణ, షప్త, అరుడ, అవధూత సామాజిక వర్గానికి చెందిన భక్తులు గంజాయిని సేవించడాన్ని పవిత్రంగా భావిస్తారని, ధ్యానంలోకి వెళ్లడానికి ఇది ఉపకరిస్తుందనే భావన వారిలో ఉందని తెలుస్తోంది. ఆయా సామాజిక వర్గానికి చెందిన వారు గంజాయి పవిత్రమైన గడ్డి పరకలుగా దీన్ని భావిస్తారట.
Recommended Video
ఆలయాన్ని ఎవరు సందర్శించినా.. వారికి గంజాయిని ప్రసాదంలా అందజేస్తామని మౌనీశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యుడు గంగాధర్ నాయక్ తెలిపారు. వార్షికోత్సవాల సమయంలో భక్తుల తాకిడి తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఎవ్వరైనా ఆలయానికి వచ్చి, స్వామివారిని దర్శించుకోవచ్చని, ఆలయ ప్రాంగణంలోనే గంజాయిని సేవించడానికీ అనుమతి ఉందని ఆయన తెలిపారు. గంజాయి సేవనాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారని అన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల్లో సాధువుల సంఖ్య అధికంగా ఉంటుందని చెప్పారు. ఉత్తర కర్ణాటక జిల్లాల నుంచి రద్దీ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.