బెంగళూరులో భారీ పేలుడు: ముగ్గురు మృతి, పలువురికి గాయాలు, భీతావహంగా ఘటనా స్థలం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలో గురువారం సంభవించిన భారీ పేలుడు కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు నగరంలోని చామరాజపేటలోని భవనంలో సంభవించిన పేలుడుకు మృతదేహాలు తునాతునకలయ్యాయి. పేలుడుతో నగర ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్థానిక ప్రజలు భయంతో దూరంగా పరుగులు తీశారు.
ఏం జరుగుతుందో తెలియక ఇళ్లల్లోంచి బయటికి పరుగులు పెట్టారు. కాగా, ఈ పేలుడు ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయాలపాలయ్యారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోవడంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. పేలుడు ప్రభావానికి స్థానికంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. గాయపడినవారిని స్థానిక విక్టోరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఓ గోడౌన్లో బాణసంచాను తరలిస్తుండగా ఈ పేలుడు సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశంలో ఈ పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
కాగా, పేలుడు దాటికి మృతదేహాలు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. వెస్ట్జోన్ కమిషనర్ సంజీవ్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం... ఓ గోడౌన్ నుంచి బాణసంచాను తరలిస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ పేలుడు ప్రమాదంలో పంక్చర్ దుకాణం యజమాని అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ పేలుడుకు సంబంధించి ఖచ్చితమైన కారణం తెలుసుకోవటానికి యత్నిస్తున్నామని డీసీపీ హరీష్ పాండే వెల్లడించారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.