Underworld: బెంగళూరు అండర్ వరల్డ్ హవా ?, ఆదిపత్య పోరు, రాయ్, పూజారి లేకుండానే గ్యాంగ్ వార్!
బెంగళూరు/ ముంబాయి: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని, ప్రపంచంలోనే ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు సిటీలో మళ్లీ గ్యాంగ్ వార్ మొదలౌతుందా ? అంటూ పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బెంగళూరు సిటీ నడిబొడ్డున గ్యాంగ్ స్టర్, పబ్ యజమాని మనీష్ శెట్టి హత్యకు గురి కావడంతో మాఫియా ముఠాల గ్యాంగ్ వార్ కు తెరలేచింది.
అండర్డ్ వలర్డ్ మాజీ డాన్ ముత్తప్ప రాయ్, మరో డాన్ పూజారి లేకుండానే వర్గ పోరు మొదలైయ్యింది. ఓ మాఫియా డాన్ బెంగళూరు, మంగళూరులోని కొన్ని టీవీ చానల్స్ కు ఫోన్ చేసి మనీష్ శెట్టి హత్య ప్రతీకారంతోనే జరిగింది, ఇంకా మా కసి తీర్చుకుంటాం అంటూ ఫోన్లు చెయ్యడంతో బెంగళూరు, మంగళూరు సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు.
Law student: విదేశీ విద్యార్థిని గ్యాంగ్ రేప్, 7 మందికి యావజ్జీవ శిక్ష, ప్రియుడి కళ్ల ముందే ఆరోజు!
పబ్ యజమాని, గ్యాంగ్ స్టర్
బెంగళూరు సిటీలో ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బెంగళూరు సిటీలో బ్రిగేడ్ రోడ్డుకు కూతవేటు దూరంలో డ్యూయెట్ పబ్ నిర్వహిస్తున్నారు. డ్యూయోట్ పబ్ యజమాని మనీష్ శెట్టి (41) అండర్ వరల్డ్ డాన్ అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 10 రోజుల క్రితం సొంత పబ్ ముందే నిలబడి ఉన్న మనీష్ శెట్టిని దుండగులు రివాల్వర్ తో కాల్చి అతి దారుణంగా హత్య చేశారు.
మంగళూరు డీలింగ్ లో తేడా
సెప్టెంబర్ 24వ తేదీన పట్టపగలు ఉడిపిలో కిషన్ హెగ్డే దారుణ హత్యకు గురైనాడు. కిషన్ హెగ్డే హత్య కేసులో హిందూ జాగరణ వేదిక కార్యకర్తలతో పాటు కొందరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు. మంగళూరులోని నౌకాశ్రయంలో వ్యాపారలావాదేవీలలో విభేదాలు రావడం వలనే కోడికేరే- కిషన్ హెగ్డే వర్గాల మద్య తేడాలు వచ్చాయని, అందుకే కిషన్ హెగ్డే హత్యకు గురైనాడని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగుచూసింది.
మేమే చంపేశాము.. రాసుకోండి
బెంగళూరు, మంగళూరులోని ప్రముఖ టీవీ చానల్ కు ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు విజయ్ శెట్టిగా పరిచయం చేసుకున్నాడు. బెంగళూరులోని డ్యూయెట్ పబ్ యజమాని మనీష్ శెట్టిని మేమే చంపేశాము అని చెప్పాడు. ఉడిపిలోని కిషన్ హెగ్డే ను హత్య చేసిన కోడికేరె మనోజ్ బాస్ ఈ మనీష్ శెట్టి. బెంగళూలో పబ్ నడుపుకోకుండా కోడికేరే మనోజ్ ను రెచ్చగొట్టించి కిషన్ హెగ్డేని పబ్ యజమాని మనీష్ శెట్టి హత్య చేయించాడని టీవీ చానల్స్ కు ఫోన్ చేసిన విజయ్ శెట్టి ఆరోపించాడు. అందుకే ప్రతీకారంగా తాము మనీష్ శెట్టిని లేపేశామని, మీరు రాసుకుంటారో, ప్రసారం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ విజయ్ శెట్టి టీవీ చానల్స్ కు చెప్పాడని వెలుగు చూసింది.
మాఫియా డాన్ ల రక్తచరిత్ర
సర్వసాదారణంగా ముంబాయి మాఫియా కార్యకలాపాలు ఎలా ఉంటాయో అలాగే బెంగళూరులో పబ్ యజమాని మనీష్ శెట్టి హత్య జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు. 1990లో మాఫియా డాన్ లు ప్రతీకార హత్యల కోసం పబ్ లు, బార్ యజమానులను హత్య చేస్తుంటారని, ఇప్పుడు అలాగే జరుగుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. గతంలో జరిగినట్లు ఇప్పుడు మాళ్లీ మాఫియా డాన్ వర్గీయులు రెచ్చిపోయే అవకాశం ఉందా ? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
ముత్తప్ప రాయ్, పూజారి లేకుండానే?
మాజీ అండర్ వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ (68) గత మే నెలలో కరోనా కాలంలోనే క్యాన్సర్ కారణంగా చికిత్స విఫలమై మరణించారు. మరో అండర్ వరల్డ్ డాన్ సెనగల్ పూజారి అలియాస్ పూజారి అలియాస్ సెనగల్ డాన్ (54) పోలీసుల వలలో చిక్కాడు. డాన్ ముత్తప్ప రాయ్ మరణించడం, మరో డాన్ పూజారి అరెస్టు అయిన తరువాత మాఫియా ముఠాల ప్రతీకార హత్యలు జరగడంతో పోలీసు వర్గాలు ఉలిక్కిపడ్డాయని తెలిసింది.
ఈ గ్యాంగ్ వార్ మంగళూరు నుంచి బెంగళూరుకు విస్తరిస్తుందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ముత్తప్ప రాయ్ సొంత ప్రాంతం మంగళూరు కావడం, పూజారితో పాటు కొందరు గ్యాంగస్టర్లు ఆ ప్రాంతానికి చెందిన వారే కావడంతో ముఠా కక్షలు మొదలైనాయి.
దావుద్ కే ముత్తప్ప రాయ్ సవాల్
గతంలో అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ముంబాయి బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం వర్గం, ముత్తప్ప రాయ్ వర్గం మాఫియా కార్యకలాపాలతో చెలరేగిపోయాయి. ఆ సమయంలో దావుద్ అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న శరద్ శెట్టి అంతం చేశారు ముత్తప్ప రాయ్ వర్గీయులు. 2002లో దుబాయ్ నుంచి ముత్తప్ప రాయ్ ను భారత్ రప్పించి అరెస్టు చేసిన తరువాత వీరి కార్యకలాపాలు చాపకింద నీరులా సాగాయి.
ఎవరు ఈ రాకేష్ మల్లి ?
ముత్తప్ప రాయ్ వర్గంలో రాకేష్ మల్లి (49)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. క్యాన్సర్ వ్యాధితో ముత్తప్ప రాయ్ మరణించిన తరువాత ఆ గ్యాంగ్ కు ప్రాతినిథ్య వహించాలని, తన మాజీ బాస్ సీటులో తాను కుర్చోవాలని రాకేష్ మల్లి ప్రయత్నాలు చేస్తున్నాడని పోలీసు వర్గాలు అంటున్నాయి. 2018 కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉడిపి జిల్లా కుందాపుర నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లి పోటీ చేసి ఓడిపోయాడు.
మంగళూరులో ఓ ఆస్తి లావాదేవీలకు సంబందించి రాకేష్ మల్లి తనను మోసం చేశాడని ముత్తప్ప రాయ్ కి తెలిసిపోయి అతన్ని దూరం పెట్టాడని పోలీసు వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద ముత్తప్ప రాయ్ మరణించిన తరువాత ఇంతకాలం ఆయనకు భయపడిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ లు ఇప్పుడు వారి కార్యకలాపాలు బెంగళూరుకు విస్తరిస్తున్నారా ? అనే కోణంలో పోలీసులు నిఘా వేశారు.