Viral video: బెంగళూరులో కుప్పకూలిన బిల్డింగ్: అంతకుముందే- 50 మంది కార్మికులు ఖాళీ
బెంగళూరు: ఉద్యాననగరి బెంగళూరులో కొద్దిరోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. వాహనాల రాకపోకలు ప్రభావితమౌతున్నాయి. పాత భవనాలకు వరుస వర్షాలు శాపంలా మారాయి. పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న బిల్డింగుల్లో నివసిస్తోన్న వారు అప్రమత్తంగా ఉండాలంటూ ఇదివరకే అధికారులు హెచ్చరికలను జారీ చేశారు.
బెంగళూరు విల్సన్ గార్డెన్స్ ప్రాంతంలోని ఓ పాత మూడంతస్తుల బిల్డింగ్ తాజాగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పినట్టు బృహత్ బెంగళూరు మహానగర పాలికే అధికారులు పేర్కొన్నారు. ఆస్తినష్టం సంభవించిందని చెప్పారు. భవనం కూలిపోయే స్థితికి చేరుకున్నట్లు ముందుగానే గుర్తించడంతో అందులో నివసిస్తోన్న వారందరూ బయటికి వచ్చారు. ఆ కొద్దిసేపటికే అది పేకమేడలా కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బెంగళూరులో నమ్మ మెట్రో ప్రాజెక్టులో పనిచేస్తోన్న కార్మికుల కోసం నిర్మించిన మూడంతస్తుల బిల్డింగ్ అది. మెట్రో రైల్ విభాగం అధికారులు చాలాకాలం కిందట దాన్ని నిర్మించారు. విల్సన్ గార్డెన్స్లో ఉంటందీ భవనం. సుమారు 50 మంది మెట్రో రైలు ప్రాజెక్ట్ కార్మికులు అందులో నివసిస్తోన్నారు. కొంతకాలంగా బెంగళూరులో కురుస్తోన్న భారీ వర్షాలకు అది పూర్తిగా దెబ్బతిన్నది. చాలావరకు ధ్వంసమైంది. అయినప్పటికీ- ఆ కార్మికులందరూ అందులోనే కాలం వెళ్లదీస్తున్నారు.
WATCH: Around 50 people had a narrow escape as the residential building they were in collapsed in Wilson Garden in #Bengaluru. The collapse of the three- storeyed building was caught on camera. (1/2) @IndianExpress pic.twitter.com/DwTPSzC2Xi
— Darshan Devaiah B P (@DarshanDevaiahB) September 27, 2021
శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనం మూడేళ్లుగా పెచ్చులూడుతూ వస్తోందని స్థానికులు, అందులో నివసిస్తోన్న మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణ కార్మికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని అంటున్నారు. కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆ బిల్డింగ్ మరింత దెబ్బతిన్నది. ఈ ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం ప్రమాదకర స్థాయిలో ఉందనే విషయాన్ని ముందే పసిగట్టడంతో ఆ 50 మంది కార్మికులు ఈ ఉదయమే దాన్ని ఖాళి చేశారు.
Timely evacuation by the Fire Department @KarFireDept ensured that the empty building collapsed. Fire Department officials rushed to the spot moments before the building collapsed and witnessed and evacuated all those inside. (2/2) @IndianExpress pic.twitter.com/yGTeafGOyb
— Darshan Devaiah B P (@DarshanDevaiahB) September 27, 2021
బృహత్ బెంగళూరు మహానగర పాలికె, అగ్నిమాపక సిబ్బంది వారిని ఖాళీ చేయించారు. వారు అనుమానించినట్టే అది కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే బీబీఎంపీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టారు. శిథిలాల తొలగింపు కార్యక్రమాలను చేపట్టారు. భవనం కుప్పకూలుతున్న సమయంలో దానికి ఆనుకునే ఉన్న మిగిలిన నివాసాలు కూడా దెబ్బతిన్నాయి. భూకంపం వచ్చినట్టుగా అవన్నీ కదిలిపోయాయి.
ఈ ఘటనలో ఇప్పటిదాకా ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం అందలేదని బీబీఎంపీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బిల్డింగ్ శకలాలను తొలగింపు కార్యక్రమాన్ని పూర్తి చేసిన తరువాత.. దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని అన్నారు. శిథిలాల్లో ఎవరూ చిక్కుకుని ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ బిల్డింగ్ కుప్పకూలడానికి కొన్ని గంటల ముందే- అందులో నివసిస్తోన్న వారిని ఖాళీ చేయించడం పట్ల బీబీఎంపీ అధికారులు, అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.