అంత డబ్బు ఇస్తావా లేక నగ్న ఫోటోలు లీక్ చేయమంటావా.. వ్యాపారవేత్తను బ్లాక్మెయిల్ చేసిన మహిళ...
నగ్న ఫోటోలు లీక్ చేస్తానని బెదిరించి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.15లక్షలు దోచుకున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ఇంటి ఎదురుగా ఉన్న ఆ వ్యాపారవేత్తతో పరిచయం పెంచుకున్న ఆమె... పక్కా ప్లాన్తో అతన్ని ఇరికించేశారు. రోజురోజుకు ఆమె బ్లాక్మెయిల్ వేధింపులు ఎక్కువవుతుండటంతో చివరకు అతను పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెతో పాటు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని హోస్పేటలో ఈ ఘటన వెలుగుచూసింది.
అసలేం జరిగింది...
స్థానిక పోలీసుల కథనం ప్రకారం... కొప్పళ్లో స్టీల్ ప్లాంట్ నిర్వహించే ఓ వ్యాపారవేత్త హోస్పేటలో నివాసం ఉంటున్నారు. అతని ఇంటి ఎదురుగా గీత అనే మహిళ నివాసం ఉంటోంది. మార్చి,2019లో ఆ వ్యాపారవేత్తకు,గీతకు పరిచయం ఏర్పడింది. ఇదే అదనుగా గీత అతన్ని బోల్తా కొట్టించే ప్రయత్నం చేసింది. ఒకరోజు టీ తాగేందుకని అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది.'టీ'లో మత్తు మందు కలపి ఇవ్వడంతో.. అది తాగిన కొద్దిసేపటికే అతను స్పృహ కోల్పోయాడు.
నగ్న ఫోటోలు లీక్ చేస్తానని...
గంట తర్వాత స్పృహలోకి వచ్చిన అతను తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడినుంచే అసలు కథ మొదలైంది. రెండు రోజుల తర్వాత అతనికి ఫోన్ చేసిన గీత... నీ నగ్న ఫోటోలు నావద్ద ఉన్నాయంటూ అతన్ని బెదిరించింది. రూ.30లక్షలు ఇస్తే వాటిని తొలగిస్తానని,లేదంటే బయటకు లీక్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. పరువు పోతుందని భయపడ్డ ఆ వ్యాపారవేత్త ఆమెను బతిమాలుకున్నాడు. డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు.
తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు
మొదట రూ.15లక్షలు ఆమె బ్యాంకులో జమ చేశాడు. కొద్దిరోజులకు మిగతా డబ్బు కోసం గీత అతన్ని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దీంతో ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. తీవ్ర ఒత్తిడికి గురైన అతను... ఇక తన వల్ల కాదని నిర్ణయించుకున్నాడు. పోలీసులను ఆశ్రయించి ఆమెపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఇంట్లో తనిఖీలు చేయగా 2.750గ్రా గంజాయి దొరికింది. వ్యాపారవేత్తను బ్లాక్మెయిల్ చేసిన వ్యవహారంలో ఆమెకు అతని కుమారుడు కూడా సహకరించినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.