ఆపరేషన్ చేసి షాక్ తిన్న వైద్యులు.. లోపల ఉన్నవేంటో తెలుసా? సెంచరీకి జస్ట్ మిస్.. అంతే!
బెంగళూరు: కర్ణాటకలోని తుముకూరు జిల్లా మరలూరుకు చెందిన సల్మా(45)కు ఇటీవలి కాలంలో భోజనం చేసిన తర్వాత తీవ్ర కడుపునొప్పి వస్తుండేది. తరచూ కడుపునొప్పి వస్తున్నా ఆమె పెద్దగా పట్టించుకోలేదుకానీ ఓ రోజు నొప్పి మరింత తీవ్రం కావడంతో తట్టుకోలేక ఆసుపత్రిలో చేరింది.
ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, ఆమె పొత్తికడుపులో వాపు వచ్చినట్టు గుర్తించారు. దీనికి తోడు ఆమె గత పదేళ్లుగా మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతోందని కూడా వైద్యులు తెలుసుకున్నారు.
మరిన్ని పరీక్షల నిమిత్తం సల్మా పొత్తికడుపును అల్ట్రాసౌండ్ స్కాన్ చేసిన వైద్యులు ఆమె పిత్తాశయం (గాల్బ్లాడర్)లో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. వాటిని తొలగించేందుకు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ఆశ్చర్యపోయారు.
సల్మా గాల్బ్లాడర్ నుంచి ఏకంగా 99 రాళ్లను వెలికి తీసినట్టు తుముకూరు జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మూడు గంటలపాటు నాన్స్టాప్గా ఆపరేషన్ చేసి ఇన్ని రాళ్లను బయటికి తీసినట్లు వివరించారు. సాధారణంగా రోగుల్లో 10-15 రాళ్లు ఉండడం సహజమేనని, కానీ ఇన్ని రాళ్లు కనుగొనడం దేశంలో ఇదే తొలిసారని వైద్యులు పేర్కొన్నారు.