వివాదాస్పదం: ఆధార్ ఉంటేనే అంత్యక్రియలు! స్మశానం ముందు మున్సిపల్ నోటీసు, తొలగింపు
ఫరీదాబాద్: అత్యుత్సాహం ప్రదర్శించి ఆపైన అభాసుపాలవడం ప్రభుత్వ అధికారులకు అలవాటే. తాజాగా హర్యానాలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఇలాగే చేసి అభాసుపాలయ్యారు.
హర్యానాలోని ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకొచ్చిన ఓ కొత్త నిబంధన వివాదాస్పదంగా మారింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరిపి, ఖననం చేయాలంటే ఆధార్ తప్పనిసరి అని పేర్కొంటూ ఒక నోటీసు బోర్డు స్మశానం బయట కనిపించడంతో స్థానికులు కంగు తిన్నారు.
ఫరీదాబాద్లోని నెహర్పార్ ప్రధాన రోడ్డులో ఉన్న శ్మశానం ముంందు బోర్డుపై మున్సిపాలిటీ వారు ఈ మేరకు ఓ నోటీసు అతికించారు. ఈ నోటీసుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సంవత్సరం ఆగస్ట్లో ఆధార్ కార్డు నంబర్ను డెత్ సర్టిఫికెట్కు లింక్ చేయాలని కేంద్రం సూచించింది. అయితే అనుసంధానం తప్పనిసరి కాదని కేంద్రం ఆ తర్వాత స్పష్టం చేసింది.
బతికున్నన్నాళ్లూ ఆధార్ను దానికి లింక్ చేయాలి, దీనికి లింక్ చేయాలి అని బెదరగొడుతున్న అధికారులు చనిపోయిన మనిషిని కూడా వదలరా? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారం చివరికి ఆ నగర మేయర్ దృష్టికి కూడా వెళ్లింది. అసలు అలాంటి నోటీసులేవీ అంటించమని చెప్పలేదని మేయర్ తెలిపారు. సంబంధిత అధికారులు ఏం జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్నారని ఆయన చెప్పారు. విషయం వివాదాస్పదం కావడంతో ఎట్టకేలకు మున్సిపల్ సిబ్బంది నాలుక్కరుచుకుని స్మశానం బయట ఉన్న ఆ నోటీసు బోర్డును తొలగించారు.