వేప చెట్టు నుంచి కారుతున్న పాలు... తాగితే నయమవుతున్న రోగాలు!
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఉన్న ఓ వేప చెట్టు నుంచి ధారాపాతంగా పాలు కారుతుండటం, ఈ పాలను తాగితే రోగాలు నయమవుతున్నాయని ప్రజలు భావిస్తుండటంతో.. ఆ చెట్టున్న ప్రాంతమంతా ఇప్పుడో చిన్నపాటి పుణ్యక్షేత్రంగా మారిపోయింది.
ఫిరోజాబాద్లోని నసీర్ పూర్ సమీపంలో ఉన్న వేప చెట్టు నుంచి చిక్కగా పాల వంటి ద్రవం కారుతోంది. ఇది సర్వరోగాలనూ హరించే ద్రవమని నమ్ముతున్న ప్రజలు, తండోపతండాలుగా ఆ చెట్టు వద్దకు వస్తున్నారు.
చెట్టు నుంచి కారుతున్న పాలు పట్టుకుని వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఆ ప్రాంతమంతా భజనలు మారుమ్రోగుతుండగా, వందలాది మంది ఇది దేవుని మహిమేనంటూ.. ఆ వేప చెట్టుకు పూజలు కూడా చేస్తున్నారు.
దీనిపై ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ విష్ణో యాదవ్ స్పందిస్తూ, ప్రజలు మూఢనమ్మకంతో భగవంతుని మహిమని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వేపలో సహజంగానే యాంటీ బాక్టీరియా గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయని, అందువల్లే ఈ ద్రవం తాగిన తరువాత చిన్న చిన్న వ్యాధులు, నొప్పులు తగ్గుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.